NewsInn

News in a Click

శుక్ర మౌఢ్యమి సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్‌ !! ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే ?

మూఢమి అంటే శూన్యం లేదా చీకటి అని అర్థం. గురుడు లేదా శుక్రడు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మౌఢ్యమి అంటారు. దీనినే వాడుక భాషలో ఆయా ప్రాంతాలను బట్టి మూఢమి లేదా మూఢం అని అంటారు. నవగ్రహాల్లోని గురుడు, శుక్రుడు గమనం చేస్తున్న క్రమంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి తమ కాంతిని కోల్పోవడం ద్వారా చీకటి లేదా మూఢమి సంభవిస్తుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే సౌర కుటుంబానికి సూర్యుడు పెద్దగా చెబుతారు. సూర్యుడి శక్తి, కాంతి అనంతం. అలాగే గురుడు, శుక్రుడు ఇవి రెండూ శుభ గ్రహాలు. ఈ శుభ గ్రహాలు మూఢమి సమయంలో తమ తేజస్సును కోల్పోవడం వల్ల.. చీకటి రోజులుగా భావించి శుభకార్యాలను వాయిదా వేస్తుంటారు.

సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురు బలం బాగా ఉండాలి. అలాగే సిరిసంపదలు, సంతోషాలకు శుక్ర బలం ఎక్కువగా ఉండాలి. అయితే మూఢమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి.. కాబట్టి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ మూఢమి ఉన్నన్ని రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ ఏడాది నవంబర్ 26వ తేదీ నుంచి శుక్ర మౌడ్యమి (గురుడు, శుక్రుడు అస్తంగత్వం) ఏర్పడనుంది. 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ శుక్ర మౌఢ్యమి కొనసాగుతుంది. అంటే సుమారు 83 రోజుల పాటు అంటే.. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘమాసం బహుళ అమావాస్య వరకు ఈ శుక్ర మౌడ్యమి ఉండనున్నట్లు పండితులు చెబుతున్నారు.

మూఢమి సమయంలో చేయకూడని పనులు
ఈ మూఢమి సమయంలో పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, నూతన గృహప్రవేశం, ఇంటికి లగ్నం, యజ్ఞాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠలు, వాహనం, ఇల్లు వంటివి కొనడం, బోర్లు వేయించడం, పుట్టువెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పదవీ ప్రమాణ స్వీకారం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు.

మూఢమి సమయంలో ఈ పనులు చేయొచ్చు!
అయితే యథాతథంగా జరుపుకునే వాటిలో సీమంతం, నూతన వస్త్రాలంకరణ వంటి వాటికి ఈ మూఢమి వర్తించదు అని చెబుతున్నారు. ఈ కార్యక్రమాలకు నమ్మకమైన పండితులను సంప్రదించి నిర్వహించుకోవచ్చు అని చెబుతున్నారు. అలాగే కొన్ని అనివార్యమైన, నిత్య కర్మలకు ఈ మూఢమి దోషం వర్తించదని కూడా చెబుతున్నారు. వాటిలో ప్రధానంగా రోజువారీ ప్రయాణాలు, నిత్యపూజ, అభిషేకం, నవగ్రహ శాంతి, సీమంతం, నామకరణం, అన్నప్రాశన వంటి కార్యక్రమాలు, చాతుర్మాస్య వ్రతాలు వంటివి ఈ శుక్ర మౌఢ్యమి రోజుల్లో వచ్చినా కూడా నిరభ్యంతరంగా చేయవచ్చని చెబుతున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో కూడా మూఢం రోజులు (మార్చి 13 నుంచి 25 వరకు) వచ్చిన విషయం తెలిసిందే.

మార్గశిర వ్రత ఫలము

‘వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేనే’అని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో.మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతోనే ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈ మాసములో ఆచరించే ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రముల యందు చెప్పిరి.“

శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా!
ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!

వివాహిత అయిన యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతి అనుమతితో ‘పుంసవన వ్రతము’ ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చునని భాగవతము నందు ఉన్నది. ఈ మాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు.
దీనినే ‘అన్నయజ్ఞము’ అని అందురు.

వాల్మీకి రామాయణము నందు ఈ మార్గశిరమాసము మాస శిరోభూషణము గాను,
ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయము గానూ చెప్పబడినది.

అంతేకాక కలువ పూలతో శివుని అర్చించిన అది మహాఫలముల నొసగును. ఈమాసములో ఒక పూట మాత్రమే భుజించి, తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధుల నుండి, పాపాల నుండీ విముక్తినందగలడు. సర్వకల్యాణ సంపూర్ణుడై, అన్నిరకాల ఓషధులను పొందగలడు.

ఈ మాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధిరహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయములో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు.
ఈ మాసములో రోజంతా ఉపవాస ముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగఫలితాన్ని పొందవచ్చు. ఆ వ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈ విధముగా ఇతరమాసముల కంటే మార్గశిరము నందు అనేకవిశిష్ట లక్షణములు కలవు. కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెలిపెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *