NewsInn

News in a Click

ఎన్నికల ఏడాది 2026

కాంగ్రెస్ వ్యూహం

సీఎం జిల్లాల పర్యటన

(హైదరాబాద్, న్యూస్ఇన్)

రాష్ట్రంలో వరస ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 17వ తేదీ నాటికి సర్పంచ్ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తి కానున్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు సాయంత్రానికి వెలువడుతాయి. పంచాయతీ ఎన్నికలతో గ్రామీణ స్థాయిలో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరింత స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.

ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించడంతో అదే జోష్ తో అన్ని ఎన్నికలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం ప్రభావం అన్ని ఎన్నికలపై ఉంటుందని సీఎం అంచనా వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగినా పార్టీలో మద్దతు లేని అభ్యర్థులు తక్కువ సంఖ్యలో బరిలో ఉంటారు. సర్పంచులుగా విజయం సాధించిన వారిని అనధికారికంగా తమ పార్టీ అంటూ అంటూ రాజకీయ పక్షాలు ప్రకటించుకుంటాయి. మెజారిటీ సర్పంచ్ స్థానాల్లో అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో పనులు చేయించే అవకాశం ఉంటుందని ప్రజలు కూడా వారికి మద్దతు తెలిపే ఛాన్స్ ఎక్కువ.

సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ వెంటనే ఆరు నెలల వ్యవధిలో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఆలోపు కీలకమైన గ్రేటర్ పాలకమండలి గడువు కూడా పూర్తికానుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు ఇప్పటినుంచే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.సోమవారం మక్తల్ నియోజకవర్గంలో పర్యటించే సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

జిల్లాల పర్యటన సందర్భంగా పట్టణాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేలా సీఎం పర్యటన లు సాగనున్నాయి. ఈ సమయంలో పట్టణాల్లో పర్యటిస్తే ఆ ప్రభావం గ్రామాలలో కూడా స్పష్టంగా ఉంటుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఒక విడత ప్రచారం ముందుగానే పూర్తవుతుంది. ప్రతిపక్ష పార్టీలు తేలుకోక ముందే అధికార పక్షంగా ముందుండాలన్న ప్రణాళికతో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన జోరుగా చర్చ జరుగుతుంది.

ఇద్దరితో రాజీనామా ?

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు స్పీకర్ కు సూచనలు కూడా చేసింది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే… దానికి కొనసాగింపుగా ఎమ్మెల్యేలపై మొదటి విడతగా వేటు వేయడమో రాజీనామా చేయించడం వంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

స్పీకర్ వేటు వేయక ముందే రాజీనామా చేస్తే రాజకీయంగా కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లయితే ఆరు నెలల్లో ఆ నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉప ఎన్నికలలో లబ్ధి పొందవచ్చని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల రాజీనామా ను చేసే కార్యాచరణ అమలు చేస్తే దానం నాగేందర్, కడియం శ్రీహరి లేదా తెల్లం వెంకట్రావు తో ముందుగా రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద రాబోయే ఆరు నెలల నుంచి ఏడాది కాలం వరకు రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *