NewsInn

News in a Click

వ‌న్య‌ప్రాణుల రక్ష‌ణ కోసం ప్ర‌త్యేక సెల్ ఏర్పాటు

ప్ర‌యోగాత్మ‌కంగా టెక్నాలజీతో వైల్డ్ సెఫ్టీ

దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్న రాష్ట్ర‌ అట‌వీ శాఖ

అడ‌వులు వ‌న్య‌ప్రాణుల‌ను సంర‌క్షింస్తాం మంత్రి కొండా సురేఖ

(హైద‌రాబాద్, న్యూస్ ఇన్)

రాష్ట్రంలో పులుల సంరక్షణలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ అర‌ణ్యభవన్‌లో స్టేట్‌-లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ప్రారంభించింది. ఈ చ‌ర్య పుల‌ల‌ను ప‌రిర‌క్షించేందుకు పెద్ద ఎత్తున ఉప‌యోగ‌ప‌డ‌నుంది. దాంతోపాటు, పులులు, మ‌నుషుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌ను కూడా త‌గ్గించ‌నుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికీ జిల్లాల వారీగా, విడివిడిగా పులుల కదలికలను గమనిస్తుండగా, తెలంగాణ మాత్రం మొత్తం రాష్ట్రాన్ని కవర్ చేసే కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇలాంటి సాంకేతిక వ్యవస్థలు ప్రస్తుతం కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో పాక్షికంగా అమల్లో ఉన్నాయని అట‌వీ అధికారులు చెబుతున్నాయి.

టైగ‌ర్ సెల్ ఎందుకు అస‌లు?

సాధారణంగా వన్యప్రాణి విభాగాలు తమ తమ పరిధుల్లోనే ప‌ని చేస్తుంటాయి. కానీ, తెలంగాణ నూతన టైగర్ సెల్ ఇందుకు వినూత్నంగా ఉన్న‌ది. ఈ విభాగం నిత్యం పులులు, చిరుత పులుల కదలికల పర్యవేక్షించ‌నున్న‌ది. దాంతోపాటు, పులులు… పులుల మ‌ధ్య ఘర్షణ ప్రాంతాలు… మ‌నుషులు, పులుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ప్రాంతాల‌ను గుర్తించి నిత్యం నిఘా ఉంచుతుంది. దాంతోపాటు, ఆ ప్రాంతాన్ని అనునిత్యం అంచనా వేస్తూ మ్యాపింగ్ చేసి పెట్ట‌నుంది. దాంతోపాటు, అడవి ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ ట్రాకింగ్ చేయ‌నుంది. యాంటీ-పోచింగ్, రెస్క్యూ బృందాల తక్షణ పాట్రోలింగ్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇవ‌న్నీ స‌మ‌గ్రంగా ఒకే చోట నిర్వహించే వ్య‌వ‌స్థ ఈ టెగ‌ల్ సెల్ కింద చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేంద్రీకృత వ్యవస్థ భారతదేశంలో చాలా అరుదుగా ఉంది.

పులుల‌ కారిడార్లలో టైగ‌ర్ సెల్ ఎలా ఉప‌యోగం?

రాష్ట్రంలోని కవాల్, ఏటూరునాగారం, కిన్నెరసాని, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లోని పులుల కదలికలు సెల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. వీటితో పాటు మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్–ఉత్తర తెలంగాణ అడవులను ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతాలతో కలిపే ఈ మార్గం దేశవ్యాప్తంగా ముఖ్యంగా టైగ‌ర్ కారిడార్‌గా గుర్తించి ఆ ప్రాంతాల్లో నిఘా ఉంచ‌నున్నారు. అయితే, పొరుగు రాష్ట్రాల్లో సరైన పర్యవేక్షణ లేకపోయినా, తెలంగాణ మాత్రం నిరంతర మానిటరింగ్ చైన్‌ను ఏర్పరచి ముందడుగు వేయ‌డం స‌ర్వ‌త్రా ప్ర‌శంసలు వ్య‌క్తం అవుతున్న‌ది. పులుల సంచారం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్విక్ రియాక్షన్ టీమ్స్ పై ఈ సెల్‌కు ప్రత్యక్ష నియంత్రణ ఉండ‌నుంది. ఇత‌ర రాష్ట్రాల్లో సాంప్రదాయ పద్ధతిలో జిల్లాల అనుమతులతో ఆలస్యం జ‌రుగుతుంది. తెలంగాణలో మాత్రం టైగ‌ర్ కమాండ్ సెంటర్ నుంచే నేరుగా టీంల‌ను పంపే విధానాన్ని ఈ విధానంలో అవ‌లంభించనున్నారు. పులులు గ్రామాల వద్ద కనిపించినా, వేట ముఠాల కదలికలు ఉన్నా, పశువులపై దాడులు జరిగినా, గాయపడిన పులులకు చికిత్స అవసరమైనా – స్పందన మరింత వేగంగా అందేలా వ్యవస్థ రూపొందించి ముందుకు వెళుతున్నారు.

శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో పులుల సంరక్షణ

టైగర్లపై రేడియో కాలర్ అమర్చే కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రారంభించేందుకు సిద్ధమైంద‌ని అట‌వీ అధికారులు చెబుతున్నారు. కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఈ విధానాన్ని ఎక్కువగా వాడుతుండగా, NTCA అనుమతి లభించిన వెంటనే తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఈ డేటా మొత్తం టైగర్ సెల్ నుంచే సేకరించి విశ్లేషించబడుతుంది. దాంతోపాటు, జాతీయ టైగర్ లెక్కల్లో తెలంగాణకు అదనపు ప్రయోజనం ల‌భించ‌నుంది.దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (AITE) లో తెలంగాణకు నూతన సెల్ పెద్దగా సహకరించనుంది. కేవలం రిజర్వుల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పులుల కదలిక పెరుగుతున్న వేళ, ఈ సెల్ కీల‌కంగా మార‌నుంది. వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 2019లోనే పలు కీలక సూచనలు చేసింద‌న్నారు. వాటిని ఆధారంగా తాము ముందుకు వెళుతున్న‌ట్టు మంత్రి కొండా సురేఖ వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *