పార్లమెంట్లో రాష్ట్ర అంశాలు ప్రస్తావించండి
ప్రాజెక్టులకు అనుమతులు-రైతు సమస్యలకు పరిష్కారం ముఖ్యం
ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
(అమరావతి, న్యూస్ ఇన్)
అత్యధిక యువ పార్లమెంటేరియన్లు కలిగిన పార్టీ టీడీపీ అని, ఈ యువ శక్తి పార్లమెంట్ వేదికగా రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ వేదికపై వినిపించాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సేవ చేయడమే టీడీపీ ఐడియాలజీగా పేర్కొన్న ముఖ్యమంత్రి… రాష్ట్రాభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలు సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు. గురువారం క్యాంప్ కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సి వ్యూహంపై పలు సూచనలు చేశారు. మొంథా తుఫాన్ నష్టపరిహారం త్వరగా రాష్ట్రానికి అందేలా చూడాలన్నారు

కేంద్రాన్ని ఒప్పించేలా చర్చించాలి
కృష్ణా–గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, గోదావరి ట్రైబ్యునల్, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్లో రాష్ట్ర గొంతుకను వినిపించాలన్నారు. వంశధార–గోదావరి-నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్ని నిర్ణయిస్తాయని… నీటి భద్రతే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్లకు అవసరమైన శక్తి వసతులపై కేంద్ర సహాయం సాధించాలి. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు, 4G–5G కనెక్టివిటీ, క్వాంటం వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్కు మద్దతు సాధించేలా ఎంపీలు కృషి చేయాలి. విశాఖ–విజయవాడ మెట్రో రైలు, విశాఖ-తిరుపతి-అమరావతి ఎకనామిక్ రీజియన్స్, భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో చర్చలు జరపాలి.
పార్లమెంటు చర్చల్లో భాగస్వాములు కావాలని అన్నారు. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కేవలం 17 నెలల్లోనే అభివృద్ధిని గాడిలో పెట్టగలిగామని సీఎం వ్యాఖ్యానించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, లోక్సభ-రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు.


Leave a Reply