ఆధ్యాత్మిక చిరునామాగా టీటీడీ
శ్రీవారి సేవకులుగా వైద్య నిపుణులకు అవకాశం
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు
ప్రధాన దేవాలయాల్లో తిరుమల తరహా విధానాలు
టిటిడి పై సమీక్షలో ముఖ్యమంత్రి
(అమరావతి, న్యూస్ ఇన్)
ప్రపంచం నలు దిక్కులా తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీని ఆదేశించారు. ఆధ్యాత్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా తిరుమల తిరుపతి దేవస్థానం మారాలని సూచించారు. గురువారం సచివాలయంలో దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆలయంలో అనుసరించే అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో అమలు చేసేందుకు ఆలోచన చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రసాదం తయారీ, క్యూ మేనేజ్మెంట్ సిస్టం సహా వివిధ అంశాల్లో ఈ విధానాలను అనుసరించాలని దేవాదాయశాఖకు సూచనలు చేశారు. ప్రసాదాల తయారీ కోసం ఆర్గానిక్ ఉత్పత్తులను ఎంచుకోవాలని సీఎం సూచించారు. తిరుమలలో భక్తుల నిర్వహణకు సంబంధించి సాంకేతికతను వినియోగించాలని పేర్కొన్నారు. భక్తులకు దర్శన సౌలభ్యం కల్పించటమే ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలన్నారు. సూచనలు చేశారు. టీటీడీ భక్తుల పోర్టల్ ను ఆర్టీజీఎస్ తో అనుసంధానించాలని ఆదేశించారు. వైకుంఠ ఏకాదశికి అన్ని భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచనలు చేశారు. వీలైనంత మంది ఎక్కువ భక్తులు దర్శనాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో నిత్యాన్నదానం జరిగేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు.

వేగంగా భక్తుల దర్శనానికి చర్యలు
తిరుమల ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు వేగంగా దర్శనాలు జరిగేలా వినూత్న కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం నిముషానికి 8 మంది భక్తుల చొప్పున దర్శనాలు చేసుకుంటున్నట్టు టీటీడీ అధికారులు వివరించారు. పండుగలు, ప్రత్యేక సమయాల్లో సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తున్నట్టు సీఎంకు తెలిపారు. దర్శనంతో పాటు కాటేజీ బుకింగ్ ఒకే మారు జరిగేలా చూస్తున్నామని తద్వారా దుర్వినియోగం అరికట్టామని సీఎంకు టీటీడీ అధికారులు తెలియచేశారు.
ఆస్పత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు
తిరుపతిలో ఉన్న ఆస్పత్రులన్నీ ఓ మోడల్ గా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
స్విమ్స్, రుయా, బర్డ్ ఆస్పత్రులను అనుసంధానిస్తూ మెరుగైన వసతులు కల్పించాలని అన్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఆస్పత్రుల తరహాలోనే వీటి నిర్వహణ కూడా చేపట్టాలని సీఎం సూచించారు. అత్యుత్తమ వైద్య నిపుణులైన డాక్టర్లను కూడా శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి ఈ ఆస్పత్రుల ద్వారా వైద్య సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని టీటీడీకి సూచించారు. ఆదేశించారు.

5 వేల దేవాలయాల రీడిజైన్
రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను రీడిజైన్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఆ దేవాలయాల్లో ఆధ్యాత్మికత, ప్రశాంతత ఉట్టిపడేలా ప్రత్యేకంగా ప్రణాళిక చేయాలని సూచించారు. వీటి నిర్మాణాన్ని టీటీడీ పాలకమండలి సభ్యుల కమిటీ పర్యవేక్షించేలా చూడాలన్నారు. కొత్త దేవాలయాల నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ పై కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు.




Leave a Reply