నగరంలో ఇదే మొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్
శనివారం నుంచి అందుబాటులోకి
(హైదరాబాద్, న్యూస్ఇన్ )
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ కష్టాలకు ఇక నుంచి శాశ్వతంగా తెర పడనుంది.
నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ (KBR Park) వద్ద పార్కింగ్ అనేది తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేకించి ఉదయం, సాయంత్రం పూట పార్క్కు, పార్క్లో వాకింగ్కు వచ్చేవారు తీవ్ర పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరోవైపు రోడ్డుకు ఒకవైపున వరుసగా వాహనాలు పార్క్ చేయడంతో వాహనాల రాకపోకలపై ప్రభావం పడుతున్నది. ఈ నేపథ్యంలో ఆ కష్టాలను తొలగించడంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మల్టీ లెవల్ స్మార్ట్ కార్ పార్కింగ్ పచ్చజెండా ఊపింది.ఇక్కడ 405 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ అధ్వర్యంలో నవ నిర్మాణ్ అసోసియేట్స్ మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను నిర్మించింది.ఇందులో 72 ఈక్వివలెంట్ కార్ స్పేస్ ఉంటుంది. 20 శాతం ద్విచక్రవాహనాల కోసం కేటాయిస్తారు.ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు.

యంత్రాలు, స్మార్ట్ కార్డ్ల ద్వారా పార్కింగ్ టికెట్లు జారీ చేస్తారు. ముందుగానే పార్కింగ్ బుక్ చేసుకునేందుకు, నావిగేషన్, ఇతర సర్వీసుల కోసం ఒక మొబైల్ యాప్ను తీసుకురానున్నారు. పార్కింగ్ సజావుగా సాగేందుకు డిజిటల్ సర్వీసుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు.జీహెచ్ఎంసీ పరిధిలో పబ్లిక్ ప్లేస్ లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి మల్టీ లెవల్ స్మార్ట్ కార్ పార్కింగ్ గా ప్రత్యేకత కలిగిన దీనిని శనివారంజీహెచ్ఎంసీ ప్రారంభించనుంది.
ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ప్రత్యేకతలు ఇవే!
- కాంపాక్ట్ డిజైన్:నిలువు రోటరీ సిస్టమ్ ద్వారా భూమి వినియోగం తగ్గింపు
- పార్కింగ్ సామర్థ్యం: 72 కార్లు + ద్వి చక్ర వాహనాల కోసం ప్రత్యేక స్థలాలు
- స్మార్ట్ యాక్సెస్: RFID ఆధారిత ప్రవేశం–నిష్క్రమణ
- ఈవీ ఛార్జింగ్: గ్రీన్ మొబిలిటీకి తోడ్పాటు
- స్మార్ట్ భద్రత: సెన్సర్లు, లాకింగ్ వ్యవస్థలు, సీసీటీవీ పర్యవేక్షణ




Leave a Reply