మున్సిపల్ పట్టణాల్లో సీఏం సభలు
(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల పర్యం పూర్తయింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన లు ఖరారు చేసుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగాయి. రాజకీయ పార్టీలు తెరవెనుక చక్రం తిప్పినా….. అధికారికంగా మాత్రం సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీలకు అతీతంగానే జరిగే ఎన్నికలు అని రాజకీయ పార్టీలు బహిరంగంగా చెబుతుంటాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీన మక్తల్ నియోజకవర్గం నుంచి సిఏం పర్యటనలు మొదలు కానున్నాయి. మక్తల్ సభను విజయవంతం చేసేందుకు ఆ జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు కసరత్తు మొదలు పెట్టారు.

మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు బయలు దేరుతుండడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. పంచాయతీ ఎన్నికల ప్రచారం అని అధికారికంగా చెప్పకున్నా....సిఏం పర్యటన అంటేనే రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో సీఏం రేవంత్ రెడ్డి పర్యటనలు దేనికి సంకేతాలు అన్న చర్చ రాజకీయంగా జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లో అభ్యర్థులు బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పంచాయతీలకు సమీపంలో ఎన్నికల కోడ్ వర్తించని పట్టణ ప్రాంతాల్లో సీఏం పర్యటనలు ఖరారు చేశారు. ఒకటో తేదీ నుంచి 6వ తేదీ వరకు ముఖ్యమంత్రి పర్యటనలు ప్రస్తుతం ఖరారయ్యాయి. 8,9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ కారణంగా రెండు రోజుల పాటు సీఎం సమ్మిట్ లోనే గడుపాల్సి ఉంటుంది. 11 వ తేదీన తొలివిడత ఎన్నికల జరుగనున్నాయి. ఈ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని సిఎం పర్యటనలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 13వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్బంగా దాదాపు 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా సిఏం బీజీ షెడ్యూల్ లో ఉండే చాన్స్ ఉంటుంది. మెస్సీ పర్యటనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. మెస్సీ పర్యటనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే సిఏం రేవంత్ కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రపంచ మేటి ఆటగాడి పర్యటన ఖరారు కావడంతో..... దీన్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రభుత్వ పరంగా రోడ్ మ్యాప్ రెడీ చేసినట్లు తెలిసింది. మెస్సీ రాకతో హైదరాబాద్ పై అంతర్జాతీయంగా ఫోకస్ పెరిగే అవకాశం ఉంటుంది.

ఈ షెడ్యూల్ తరువాత మరోసారి కూడా ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు ఈ నెల 17వ తేదీ నాటికి పూర్తి కానున్నాయి. ఆ లోపే ఒకటి రెండు మున్సిపల్ పట్టణాల్లో సిఎం పర్యటన ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే విధంగానే సిఎం పర్యటనలు, ప్రసంగాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. పంచాయతీ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. వీటిని దృష్టిలో ఉంచుకుని విపక్షాల కంటే ముందుగానే ప్రజాక్షేత్రంలో ఉండాలన్న అభిప్రాయంతో సీఏం పర్యటనలు ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు ఎన్నికల్లో బీజీగా ఉన్న సమయంలో సీఏం జిల్లాల పర్యటనకు ఏర్పాట్లు చేయాలంటే అధికారులు కూడా కనీసం నాలుగైదు రోజులు ముందుగానే అన్ని ఏర్పాట్లపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఓ వైపు ఎన్నికల నిర్వహణ వత్తిడి మరో వైపు సిఏం పర్యటనల నేపథ్యంలో అధికారుల్లో కూడా ఇది చర్చకు దారి తీస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కనీసం రెండు, మూడు రోజులుగా సిఏం సభను విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. మొత్తం మీద సిఏం జిల్లాల పర్యటనలు ఎన్నికల కోసమే అన్న వాదన బలంగా వినిపిస్తోంది.


Leave a Reply