NewsInn

News in a Click

స‌ర్పంచ్ అభ్య‌ర్థులు ప్ర‌జా తీర్పు కోరండి

ఏక‌గ్రీవాలు వ‌ద్దు

ఏక‌గ్రీవం అయితే నా ద‌గ్గ‌ర‌కు రావ‌ద్దు

మంత్రి జూప‌ల్లి బ‌హిరంగ లేఖ‌

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్ )

      రాష్ట్రంలో జ‌రుగుతున్న  సర్పంచ్ ఎన్నికల్లో  కొన్ని గ్రామాలలో వేలం పాటలు, బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయి అన్న సమాచారం నాకు అందింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రజల స్వేచ్ఛకు చైతన్యానికి విరుద్ధం.సర్పంచ్ ఆశావాహులు, ప్రజలతో ఉన్నవారు ప్రజా తీర్పు కోరండి. ప్రజాస్వామ్య తీర్పుతో వచ్చే పదవులను వేలం పాట ద్వారా పొందే వ్యక్తులు నా దగ్గరకు రావద్దు. 

పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలు అలాంటి పల్లెల్లో ప్రజాస్వామ్యం పరడవిల్లాలి కానీ, ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు లేదా, ప్రజా తీర్పులపై విలువ లేని నాయకస్వామ్యం ప్రజల చైతన్యాన్ని కాలరాసే విధంగా వేలంపాటల ద్వారా పదవులు పొందడం ఏకగ్రీవం కాదు, ఈ చర్య ఆధిపత్యం చేసే వ్యక్తుల తీర్పు అవుతుందే కాని ఏకగ్రీవం కాదు.

బలవంతపు వేలంపాటల ద్వారా పదవులు దక్కించుకున్నవారు, ప్రజల కష్టాల్లో భాగస్తులు కాలేరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేరు. నియంతలుగా మారి ఏకోన్ముఖ పాలన చేస్తారు. గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించలేరు, ఇది ధనస్వామ్యం అవుతుంది తప్పా! ప్రజాస్వామ్యపు తీర్పు కాదు. ప్రజాస్వామ్య ప్రక్రియను వేలం సరుకు గా మార్చడాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.

పౌరునికి ఓటు భారత రాజ్యాంగం కల్పించిన ఆయుధం దానిని ఏకగ్రీవాల పేరుతో వేలంపాటలో నిర్వీర్యం చేయడం సరికాదని అనుకుంటున్నాను. ఓటు అడగడానికి ఈ సందర్భంగా నాయకులు ఓటరును కలిసే ఎంతో ఉన్నతమైన మార్గం. ఓటరతో ఎన్నో ఆలోచనలు పంచుకునే ప్రజాస్వామ్య వేదిక, అలాంటి వేదికను ధన బలంతో కూల్చడం సరికాదు. కాబట్టి ఏ రాజకీయ పదవి అయిన ప్రజల మద్దతుతో రావాలి, డబ్బుతో కాదు, బలవంతపు వేలంతో కాదు.

నిజమైన ఏకగ్రీవం ప్రజల ఏకాభిప్రాయంతో ఆ నాయకుని ప్రజాసేవను గుర్తించి జరగాలి కానీ, ధనస్వామ్యపు వేలంపాటల ద్వారా కాదు కాబట్టి ఇది ఏకగ్రీవం కానే కాదు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఏ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయం ప్రకారం ఓటు వేసి సర్పంచులను ఎన్నుకోండి. వేలం పాటలు, ధన ప్రలోభాలు అభివృద్ధిని భంగ పరుస్తాయని గుర్తుచేసుకోండి.

ఓటు సామాన్యుని ఆయుధమని చెప్పిన అంబేడ్కర్ ఆలోచనను గౌరవించాలని, “ప్రజల కొరకు, ప్రజలచేత, ప్రజలకోసం” ఎన్నుకోబడి వారి కోసం పనిచేసే వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థని చెప్పిన అబ్రహం లింకన్ మనకు ఆదర్శం కావాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ… పారదర్శక ఎన్నికల ద్వారా నిజమైన నాయకులను ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

ఇట్లు
మీ జూప‌ల్లి కృష్ణారావ్
ప‌ర్యాట‌క సాంస్కృతిక ఎక్సైజ్ శాఖా మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *