NewsInn

News in a Click

మాజీ ఎంపీ సంతోష్ కు మరో పురస్కారం

దక్కిన గ్రీన్ ఇండియా ఆర్కిటెక్ట్ పుర‌స్కారం

అవార్డు ప్ర‌దానం చేసిన‌ ప్రముఖ మ్యాగ‌జైన్‌

పర్యావరణాన్ని కాపాడడం కొత్తగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టినందుకు మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కు గ్రీన్ ఇండియా ఆర్కిటెక్ట్ పురస్కారం దక్కింది.19 కోట్లకు పైగా మొక్క‌లు నాటేందుకు, వాటిని సంర‌క్షించేందుకు గొప్ప ప్రేర‌ణ‌గా నిలిచిన గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్ర‌తిష్టాత్మ‌క‌ అవార్డు దక్కించుకున్నారు.

ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా, ఇండస్ట్రియల్ అవుట్‌లుక్ మ్యాగజైన్, ఈపీఎస్ ఎనర్జీ ఎక్స్పో సంయుక్త ఆధ్వర్యంలో శ‌నివారం (న‌వంబ‌రు 29) పుణెలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ అవార్డును అంద‌జేశారు. సంతోష్‌కుమార్ త‌ర‌పున క‌రుణాక‌ర్‌రెడ్డి ఈ పుర‌స్కారాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా అంద‌జేసిన ప్ర‌శంసాప‌త్రంలో…“హరా హై తో భరా హై”, “గ్రీన్ ఇండియా ఫర్ ఎ గ్రేట్ ఇండియా” వంటి నినాదాల స్ఫూర్తిని నిజం చేసేలా మాజీ ఎంపీ సంతోష్ చేసిన ప‌ర్యావ‌ర‌ణ నిర్మాణాత్మ‌క సేవ‌ల‌ను, సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను కొనియాడారు. ఈ సంద‌ర్భంగా ఈపీఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా ఓ ప్రజా ఉద్యమంగా మారింద‌ని ప్ర‌శంసించారు.

ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ కోసం ప్రేర‌ణ‌గా నిలిచి ప‌ట్ట‌ణాల్లో అట‌వీ ప్రాంతాల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డింద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లంద‌రినీ భాగ‌స్వాములను చేయ‌డం గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్ర‌త్యేక‌త అని కొనియాడారు. సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ‘మాస్ ప్లాంటేషన్ డ్రైవ్స్’, ‘వాక్ ఫర్ వాటర్’, ‘లివబుల్ ప్లానెట్’ వంటి పర్యావరణ, నీటి సంరక్షణ, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఈపీఎస్ ప్ర‌తినిధులు వివ‌రించారు. స్వ‌చ్ఛ‌మైన హ‌రిత స‌మాజం రూపుదిద్దుకునేలా గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహ‌ద‌ప‌డుతున్న‌ద‌ని చెప్పారు. (ఫొటో- పుణెలో శ‌నివారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్ త‌ర‌పున అవార్డును స్వీక‌రిస్తున్న క‌రుణాక‌ర్‌రెడ్డి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *