వద్దంటున్న మంత్రి జూపల్లి
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రి జూపల్లి బహిరంగ లేఖ అధికార పార్టీ నేతల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఎలాగైనా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.మంత్రి జూపల్లి కృష్ణరావ్ ప్రజాబలంతోనే సర్పంచ్ లుగా ఎన్నికై రావాలని పిలుపునిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ పదవులు వేలం పాటతో దక్కించుకుంటున్న ఘటనలపై మంత్రి జూపల్లి స్పందించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే…వేలం పాటల ద్వారా సర్పంచ్ పదవులు ఎలా దక్కించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మంత్రి జూపల్లి ప్రజాతీర్పుతో ప్రజల మద్దతు పొందాలని కోరుతుండడం కొత్త చర్చకు దారి తీస్తోంది. మంత్రి జూపల్లి వ్యాఖ్యలు ప్రజా స్వామ్యానికి స్పూర్తినిచ్చేవి అయినా…ఆచరణలో ఇది ఎంత వరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏకగ్రీవం అయ్యే స్థానాల కోసం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కీలక నేతలు పావులు కదుపుతూ ఏక్రగీవం చేసుకుని తమ పట్టు నిరూపించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీలో మెజార్టీ నేతలు కూడా ఎన్నికలకు వెళ్లే కంటే…ఏకగ్రీవం చేసుకుంటే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు. ఇదే వ్యూహంతో కీలక నేతలు తమ తమ నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పదవి కోసం పోటీ పోటీగా ఉన్నా….ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని ఏకగీవ్రం అయ్యేలా పావులు కదిపారు. సీఎం ప్రాథినిత్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సానుభూతి పరులు ఏకగ్రీవంగా ఎన్నో స్థానాలను కైవసం చేసుకున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ అనుంగు అనుచరుల కోసం ఏకగ్రీవం చేసేందుకు అనుగుణంగా పావులు కదుపుతూ నజరానాలు ప్రకటిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ కోసం పని చేసిన వారికి ఆ మాత్రం మేము సహాయం చేయాలేమా అంటూ మీడియా సమావేశాలు పెట్టి మరీ ఏకగీవ్రం చేసుకునేలా చక్రం తిప్పుతున్నారు.
మొదటి విడత ఎన్నికల సమయంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావ్ సర్పంచ్ లు ఏకగ్రీవం అయ్యేందుకు తాను వ్యతిరేకం అంటూ బహిరంగ లేఖను రాశారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అధికార పార్టీగా రికార్డు స్థాయిలో ఏకగ్రీవంగా సర్పంచ్ లుగా తమ మద్దతు దారులను గెలిపించుకుంటే భవిష్యత్తులో రాజకీయంగాచక్రం తిప్పేందుకు సులువుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూపల్లి వ్యాఖ్యలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా పలువురు నేతల్లో వ్యక్తం అవుతోంది.



Leave a Reply