NewsInn

News in a Click

‘పుట్టా’ కు బేయిల్- సీరియ‌స్-వివాదం

‘పుట్టా’ కు బేయిల్- సీరియ‌స్-వివాదం

( హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

హైద‌రాబాద్ లో డ్ర‌గ్ పార్టీలో ప‌ట్టుబ‌డ్డ టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్ పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. పుట్టా మ‌ధుపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై నివేదిక ఇవ్వాల‌ని పార్టీ అధ్య‌క్షులు ప‌ల్లా శ్రీనివాస్ ను ఆదేశించారు. అప్ప‌టి వ‌ర‌కు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని ఆదేశించారు. డ్ర‌గ్స్, మాద‌క ద్ర‌వ్యాల కేసులో ఎవ‌రున్నా ఉపేక్షించేది లేద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. వ్య‌క్తులు చేసిన త‌ప్పుల‌కు పార్టీ న‌ష్ట‌పోయే ప‌రిస్థితి రానివ్వ‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు.

మెజిస్ట్రేట్ ముందుకు పైలెట్ బ్ర‌ద‌ర్స్…..

ఈ కేసులో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదాస్ప‌దంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. డ్ర‌గ్స్ కేసులో 11 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేసి అందులో ఆరుగురు పాజిటివ్ గా తేలార‌ని వైద్య ప‌రీక్ష‌ల ద్వారా నిర్ధారించారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మ‌హేష్ లు ఇద్ద‌రు పాజిటివ్ అని పోలీసులు ప్ర‌క‌టించారు. పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌న్న కార‌ణంగా ఎంపీ పుట్టా మ‌హేష్, అర్జున్, ప్రియాంక‌ల‌కు స్టేష‌న్ బేయిల్ ఇచ్చి వపంపించారు. విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని నిబంద‌న‌లు విధించారు. పోలీసులు బేయిల్ ఇవ్వ‌డంతో పాటు మీడియా కంట ప‌డ‌కుండా ఎంపీ దొడ్డి దారిన వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశార‌న్న విమ‌ర్శ‌లు పోలీసుల‌పై మొద‌ల‌య్యాయి.

పోలీసులే బేయిల్ ఇచ్చారా…….బాబు చ‌క్రం తిప్పారా….

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు స్టేష‌న్ బేయిల్ ద‌క్క‌డం ఇక్క‌డ హాట్ హాట్ గా మారింది. హైద‌రాబాద్ లో వెలుగు చూసిన డ్ర‌గ్స్ కేసులో రాత్రి పోలీసులు జ‌రిపిన దాడుల్లో ర్యాపిడ్ టెస్ట్ లో పుట్టా తెలివి తేట‌ల‌తో త‌ప్పించుకునే య‌త్నం చేశారు. పోలీసుల ర్యాపిడ్ టెస్ట్ లో నెగెటివ్ అని రిపోర్ట్ వ‌చ్చింది. ( పోలీసులు మూత్ర ప‌రీక్ష చేసిన సంద‌ర్భంగా ఇచ్చిన బాటిల్ లో నిళ్లు నింపార‌ని) పోలీసులు చెప్పారు. ఆ త‌రువాత ర‌క్త న‌మూనాల సేక‌రించిన టెస్ట్ లో పుట్టాకు పాజిటివ్ అని తేలింద‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. మొత్తం 11 మందికి ఒకే సెక్ష‌న్లు వ‌ర్తించేలా పోలీసులు కేసు న‌మోదు చేశారు. పోలీసులు మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో కూడా ఏ ఏ సెక్ష‌న్ల ప్ర‌కారం కేసులు న‌మోదు చేశామో వెల్ల‌డించారు. ఆ జాబితాలో 2వ పేరే పుట్టా మ‌హేష్ తండ్రి పేరు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ అని రాసి ఉంది. ఈ పేప‌ర్ లో ఎంపీ అని ఎక్క‌డా పోలీసులు ప్ర‌స్తావించ‌లేదు. పుట్టా మ‌హేష్ వ్యాపార వేత్త అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వృతి కూడా వ్యాపార‌మ‌నే పోలీసులు న‌మోదు చేశారు. శ‌నివారం రాత్రి నుంచి జ‌రిగిన ప్ర‌చారం తో తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయంగా కేసు ఎంతో ప్రాధ‌న్య‌త సంత‌రించుకుంది. ఈ ప‌రిస్థితుల్లో ఆదివారం సాయంత్రం పుట్టా మ‌హేష్ కు స్టేషన్ బేయిల్ ఇస్తూ పోలీసులు పంపించారు. ఈ విష‌యంలో త‌మ పార్టీ ఎంపీని కాపాడుకునేందుకు చంద్ర‌బాబు చ‌క్రం తిప్పారా…పోలీసులే బేయిల్ ఇచ్చేందుకు ఆస‌క్తి చూపారా అన్న అనుమానాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతున్నాయి. పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని సాంకేతిక కార‌ణాన్ని పోలీసులు చెబుతున్నారు. అయితే పుట్టాతో పాటు మ‌రో ఇద్ద‌రిని కూడా బేయిల్ పై పోలీసులు విడుద‌ల చేయ‌డం విశేషం. విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హామీ ఇచ్చిన త‌రువాత వారిని వ‌దిలి పెట్టామ‌ని పోలీసులు చెబుతున్నారు. రాజ‌కీయంగా ఇది విమ‌ర్శ‌ల‌కు దారి తీసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *