(అమరావతి,న్యూస్ఇన్)
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ చైర్మన్ జీఎన్ రావులతో కలిసి ఈ ఐ కేర్ సెంటర్ ను సీఎం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కంటి ఆస్పత్రులు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఐ కేర్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించిన సువెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ చైర్మన్ జాస్తి వెంకట్ ను సీఎం అభినందించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న లక్ష్యంతో జాస్తి వెంకట్ ఈ ఐ కేర్ సెంటర్ కు ఆర్ధిక సహకారాన్ని అందించారని, ఈ ప్రాంతంలో పేదలకు సైతం ఉత్తమ నేత్ర వైద్యం అందుతుందని సీఎం అన్నారు. ఈ ఐ కేర్ సెంటర్ కు ఏడాదికి 50 వేల మంది అవుట్ పేషెంట్లను పరీక్షించే అవకాశం ఉందని 5 వేల వరకూ శస్త్ర చికిత్సలు నిర్వహించే సామర్ధ్యంతో ఏర్పాటు చేయటం సంతోషదాయకమని ముఖ్యమంత్రి అన్నారు.

ఏపీ తెలంగాణా, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లాభాపేక్ష లేకుండా సేవలందిస్తోందని సీఎం కొనియాడారు. ప్రజలకు సంక్షేమం- అభివృద్ధితో పాటు ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి వైద్యారోగ్యానికి రూ.19,305 కోట్లను కేటాయించామని తెలిపారు. కంటి చికిత్సల విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఈ ఏడాది 4 లక్షల కేటరాక్ట్ సర్జరీలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పాఠశాల విద్యార్ధులకు కూడా ఐ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం వివరించారు. ప్రభుత్వం చేపట్టిన సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులతో మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం తెలియచేశారు.














Leave a Reply