NewsInn

News in a Click

రాహుల్ గాంధీకి విజన్ లేదు: కేటీఆర్

విప‌క్షంగా కాంగ్రెస్ విఫలం

మోడీకి అతిపెద్ద బలం రాహుల్ నాయకత్వం

ప్రాంతీయ పార్టీలే బిజెపికి ప్రత్నామ్నాయం

జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా తీవ్రంగా విఫలమైందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ఎజెండాను, ఒక మోడల్‌ను దేశానికి అందించడంలో దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. దేశ ప్రధానికి అతిపెద్ద బలంగా రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం మారారని అన్నారు. “రిబూటింగ్ ది రిపబ్లిక్” (Rebooting the Republic) అనే అంశంపై కేటీఆర్ చెన్నైలో జరిగిన కార్యక్రమంలో తన అభిప్రాయాలు పంచుకున్నారు.
నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమీ లేదని, మరోవైపు రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘకాల విజన్ లేదు అన్నారు.

దేశంలోని ఆర్థిక వ్యవస్థ పైన, ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన, ఇన్నోవేషన్ పైన, పారిశ్రామిక ప్రగతి పైన రాహుల్ గాంధీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ఏనాడు చూడలేదని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీజేపీని ఎదుర్కోవడం కష్టమని, ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యం అవుతుందని అన్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో తోక పార్టీ లాంటి కాంగ్రెస్…. అనేక స్థానాల్లో పోటీ చేస్తామని మొండికి వేయడం వల్లనే బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందని అన్నారు.

KTR IN CHENNAI


గతంలో కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీల వేదిక ఒకటి ఏర్పాటు చేసి దేశానికి ప్రత్యామ్నాయ నమూనాను అందించాలని ప్రయత్నం చేశారని, దురదృష్టవశాత్తు అది ముందుకు పోలేదన్నారు. రాహుల్ గాందీ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు కనీసం లక్ష కోట్ల ప్రాజెక్ట్ వ్యయం లేని కాలేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడడం అయన ఆజ్ఞానానికి నిదర్శం అన్నారు.బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేసి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. బిజెపి పది సంవత్సరాల్లో విభజన రాజకీయాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లిందని, అయితే బిజెపి విభజన రాజకీయాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలుగా మేము కూడా విఫలం అయ్యామని కెటిఅర్ అంగీకరించారు.పది సంవత్సరాల పాటు అనేక రంగాల్లో ముఖ్యంగా ఆర్థిక ప్రగతి అద్భుతంగా సాధించిన తెలంగాణ రెండు సంవత్సరాల్లో వెనుకబడడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచాకాల నుంచి పార్టీని కాపాడుకోవాల్సి వస్తుందన్నారు.

రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపాము

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతి వైపు తీసుకెళ్లడానికి మాకు అనేక అవకాశాలు దొరికాయి. తెలంగాణ రాష్ట్రం పట్ల నిబద్ధతతో అభివృద్ధి వైపు తీసుకెళ్లాము. అందుకే స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి మొదలుకొని తలసరి సగటు ఆదాయం వరకు అన్ని రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచాము. 12వ స్థానంలో ఉన్న ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ లాంటి రాష్ట్రాలను తలదన్ని దేశంలోనే అగ్రస్థానాన్ని సాధించాం.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాము. బెంగళూరు వంటి ఐటీ దిగ్గజ నగరాలకి పోటీగా అనేక రంగాల్లో ఆయా నగరాలను దాటుకుని ముందుకు పోయాం. అద్భుతంగా పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్రస్థానంలో నిలిపినా…. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ ప్రజల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *