పదవుల కోసం ఇంత దిగజారుతారా
66 శాతం నమ్మకముంటే ఎన్నికలకు రా!
అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగం
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
పంచాయితీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నరని చెప్పుకుంటున్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) బహిరంగ సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఏవైపుఉన్నారో నిర్ణయిస్తారని, దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని కెటిఅర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను, ఫిరాయింపు ఎమ్మెల్యేల ద్వంద్వ వైఖరిని కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
ఆ 66 శాతం నిజమైతే.. తేల్చుకుందాం రా!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని కేటీఆర్ విమర్శించారు. “నిన్న హైదరాబాద్ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి మొదట కాంగ్రెస్ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారు. కానీ, సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారు. ముఖ్యమంత్రి గారూ.. మీకు నిజంగానే 66 శాతం ప్రజాధరణ ఉంటే, నా సవాల్ స్వీకరించండి. మా పార్టీ నుంచి మీరు సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లిన ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. అప్పుడు ప్రజలే చెప్తారు ఎవరి శాతం ఎంతో.. ఎవరి బతుకెంతో.. ఎవరి సత్తా ఎంతో ప్రజా క్షేత్రంలోనే తేలిపోతుంది” అని కేటీఆర్ సవాల్ విసిరారు.
గడ్డిపోచ లాంటి పదవుల కోసం ఇంత దిగజారుతారా….
ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మంత్రులుగా, స్పీకర్లుగా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కేవలం ‘గడ్డిపోచ’ లాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. “బయట కాంగ్రెస్లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, రాహుల్ గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు పూర్తిగా ఆగమైపోయాయి” అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి వచ్చారన్నారు.
మోసం చేసిన కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెప్పారు
కార్యకర్తలకు భరోసా..
బెదిరింపులకు, ఫోన్ కాల్స్కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. “గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలి. వచ్చే సంవత్సరంలో కొత్తగా సభ్యత్వ నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసుకుంటాం. పాత తరం అనుభవం, కొత్త రక్తం కలిసేలా చాకుల్లాంటి నేతలతో కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాం” అని ప్రకటించారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.








Leave a Reply