రూ.5.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది
2.7 లక్షల ఉద్యోగాల కల్పన
మంత్రి నారా లోకేష్
(అమరావతి,న్యూస్ఇన్)
గ్రీన్ ఎనర్జీ రంగంలో 2029 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం. క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ ఇప్పటికే రూ.5.22 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. తద్వారా పునరుత్పాదక శక్తి, అనుబంధ రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాలు రానున్నాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సుస్థిరతను విస్తృతస్థాయిలో అమలుచేయడం: ప్రపంచ పరివర్తనకు మార్గాలు (Sustainability at Scale: Pathways for Global Transformation) అనే అంశంపై సీఐఐ (Confederation of Indian Industry) ఆధ్వర్యంలో దావోస్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఐఐ నిర్వహించిన ఈ సమయోచిత చర్చలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. సస్టైనబులిటీ ఇప్పుడు ఉద్దేశాల దశను దాటి అమలు దశలోకి ప్రవేశించింది. ఇది కార్యాచరణకు అంకితమైన దశాబ్దం. సస్టైనబులిటీని మూడు విధాలుగా చూస్తున్నాం. మొదటిది ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా మేం 6 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతున్నాం. ఇందుకు అవసరమైన విద్యుత్ ను కాలుష్యరహితంగా అందించడానికి ప్రభుత్వం 24 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం జరిగింది.

విశాఖలో గూగుల్ ఏఐ హబ్ను ఇప్పటికే ప్రారంభించాం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఇది డిజిటల్ గ్రోత్, క్లీన్ ఎనర్జీ ఒకేసారి ముందుకు సాగాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ఆమోదించడం జరిగింది. తద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో 2029 నాటికి 125 బిలియన్ డాలర్ల (రూ.10 లక్షల కోట్లు) గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇవి సౌర, గాలి, నిల్వ (స్టోరేజ్), గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ భారత్ నుంచి జర్మనీకి ప్రపంచంలోనే తొలి దీర్ఘకాలిక గ్రీన్ అమ్మోనియా ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, మొత్తం భారతదేశానికి కీలక మలుపని వ్యాఖ్యానించారు.రాబోయే ఐదేళ్లలో 3 లక్షల క్లీన్ ఎనర్జీ ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాల కల్పనగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని లోకేష్ వివరించారు. పెట్టుబడిదారులను ఏకం చేయడానికి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు చాలా అవసరం.




Leave a Reply