ఒక్క గొడుగు కిందకే
తహశీల్దార్ కార్యాలయాలకు ఒకే మోడల్
భూభారతి పోర్టల్ తో అనుసంధానం
సి.సి.ఎల్.ఏ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
పరిపాలన వ్యవస్ధను మరింత పారదర్శకంగా వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకువచ్చి భూభారతి పోర్టల్ తో అనుసంధానం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వచ్చే జనవరి నెలలో ఆధునీకరించిన ఈ వ్యవస్ధను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాంపల్లిలోని సి.సి.ఎల్.ఎ. కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ విభాగాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ భూ పరిపాలనకు కేంద్రమైన సిసిఎల్ ఎ కార్యాలయం నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్కు ధీటుగా ఆఫీసును ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, అప్పటివరకు కొంతమార్పు కనిపించాలని అన్నారు. వరుసగా విభాగాల వారీగా సమీక్షించడం కూడా జరుగుతుందని ఇందుకు సంబంధించి అధికారుల పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగానిర్మించబోయే తహశీల్దార్ కార్యాలయాలు ఒకే మోడల్గా ఉండాలని ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించాలని అధికారులకు సూచించారు.ఒక్క క్లిక్తో రైతుకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా అదేవిధంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్కు మ్యాప్, నాలా ఆర్డర్లు, ఆర్వోఆర్ , గ్రామాల నక్షా, ఫీడ్ బ్యాక్ వంటి పూర్తి సమాచారం లభించేలా సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలతో అనుసంధానం చేస్తూ భూభారతి పోర్టల్ను పూర్తి స్ధాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఆధార్ నెంబర్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావాల్సిన సమాచారం లభిస్తుందన్నారు. క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సర్వే నెంబర్కు మ్యాప్ ను రూపొందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్ధ ఆధునీకరణ చేసే ప్రతిపనిలో సామాన్యుని కోణం ఉండాలని ఎలాంటి లోపాలకు, తారుమారుకు ఆస్కారం లేకుండా సాఫ్ట్ వేర్ను అభివృద్ది పరచాలని సూచించారు








Leave a Reply