(న్యూస్ఇన్,హైదరాబాద)
తమిళ రాజకీయాల్లో అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న విజయ్ జోసెఫ్ నమ్మిన జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిత్ వెట్రివేల్ తెలంగాణా రక్షణ సేన అధినేత్రి కవితను కలుసుకున్నారు. విజయ్ తమిళ నాట రాజకీయ పార్టీ స్థాపించిన నాటి నుంచి వెట్రివేల్ సూచనలతో నిర్ణయాలను అమలు చేస్తూ తమిళ నాడు సీఎంగా విజయ్ అవకాశం దక్కించుకున్నారు. కవిత కూడా తాను తెలంగాణాకు ముఖ్యమంత్రి అవుతానని ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణాలో తమ పార్టీని అధికారంలోకి తెచ్చి సీఎంగా అవకాశం దక్కించుకునేందుకు కవిత తమిళ నాడుకు చెందిన ఈ ప్రముఖ జ్యోతిష్యుడితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ని కవిత నివాసంలో సుదీర్ఘంగా ఈ భేటి జరిగింది. కవిత కుటుంబసభ్యులు కూడా ఈ సందర్భంగా వెట్రివేల్ ను కలిసి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్లకు పైగా సమయం ఉండడంతో ఈ తమిళ జ్యోతిష్యుడిని కవిత తన నివాసానికి ఆహ్వానించి ఆయన సూచనలను కోరినట్లు తెలుస్తోంది. తమిళ నాడులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రిక్కీ రాధన్ వెట్రివేల్ మాత్రమే ప్రకటనలు చేస్తూ వచ్చారు. విజయ్ రాజకీయ నిర్ణయాలకు ముహూర్తాలు ఖరారు చేస్తూ ఎన్నికలకు టీవీకేను సిద్ధం చేశారు. ఫలితాలు కూడా అనుకున్నట్లు రావడంతో ఈ జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చిన విజయ్ ఆ తరువాత వచ్చిన తీవ్ర విమర్శలతో వెనక్కి తగ్గారు. ఆ పదవి నుంచి తప్పించి కొత్త బాధ్యతలను అప్పగించారు.

తమిళ రాజకీయాల్లో వెట్రివేల్ ను నమ్ముకుని విజయ్ సీఎం కావడంతో ఈ జ్యోతిష్యుడి పేరు రాజకీయ వర్గాల్లో మరుమ్రోగింది. ఇక సీఎం అవుతానని తెలంగాణాలో ప్రకటనలు చేస్తున్న కవిత కూడా ఈ జ్యోతిష్యుడిని నమ్ముకుని ముందుకు వెళ్లే విధంగా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక రాబోయే ఎన్నికలను వెట్రివెల్ నిర్ణయాలకు అనుగుణంగా కవిత రాజకీయంగా అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తమిళ ప్రముఖ జ్యోతిష్యుడి జోస్యం తెలంగాణా రాజకీయాల్లో ఎంత వరకు ప్రభావితం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.










Leave a Reply