తొలి మూడు రోజులు టోకెన్ ఉన్న భక్తులకే దర్శనం
భక్తులను రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు
2వ తేదీ నుంచి టోకెన్ లేని భక్తులకు దర్శనం
టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు
(అమరావతి,న్యూస్ ఇన్)
డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదన్నారు.

గత రెండు నెలలుగా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్ల కోసం టీటీడీ అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోందని తెలిపారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిలకు ఈ-డిప్ ద్వారా భక్తులకు టోకెన్లు కేటాయించామని చెప్పారు. ఈరోజుల్లో టోకెన్ ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామన్నారు. ఆ రోజుల్లో టోకెన్ లేని భక్తులలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పారు.టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2వ తేది నుండి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వారా దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.




Leave a Reply