ఒక్కరోజు ఎంపీల సమావేశం ఖర్చు రూ.13,59,217 లు
ఒక్కో ఏంపీ మధ్యాహ్న ప్రభుత్వ భోజనం ఖర్చు రూ.84,370 మాత్రమే
ఇతరాత్రా ఖర్చులు మరో రూ.5 లక్షలే
(హైదరాబాద్, న్యూస్ఇన్)
అవును…. మీరు చూసింది నిజమే… ఒక్క ఎంపీ ప్రభుత్వ సమావేశానికి హాజరైతే ఎంత ఖర్చవుతుందనేది ఎవరు అంచనా వేయలేరు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలే ఆ ఎంపీల ఖర్చులకు సంబంధించి వివరాలు వెల్లడిస్తాయి. ప్రభుత్వం మార్చి నెలలో నిర్వహించిన ఎంపీల సమావేశానికి పదిమంది ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో అతిథులకు మధ్యాహ్న భోజనం కూడా సర్కార్ ఏర్పాటు చేసింది. సమావేశం తో పాటు… మధ్యాహ్న భోజనానికి అయిన ఖర్చు చూస్తే ముక్కున వేలుసుకోవాల్సిందే. ఇది హస్తినలోనో…. విదేశాల్లోనో జరిగిన సమావేశానికి సంబంధించిన బిల్లు కానే కాదు….హైదరాబాదులోనే.. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు గంటల ఎంపీల సమావేశం కోసం వెచ్చించిన ఖర్చు మాత్రమే.మార్చి 8న ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమావేశానికి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల, ఇద్దరు బిజెపి ఎంపీలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశం కావడంతో అతిథులకు ఏమాత్రం లోటు రాకూడదని అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపీలకు స్వాగతం పలికే బొకేలు, సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు, అనంతరం భోజనం అన్ని ఖర్చులు కలిపి ఆరోజు రూ.13,59,217 లుగా ప్రభుత్వం వెచ్చించింది. ఇందుకోసం తాజ్ కృష్ణ హోటల్కు రూ.8,43,700.,హోటల్ ది ప్లాజాకు రూ.1,95,800. ఎన్ఎం కంపెనీకి రూ. 3.06,517. అంజలి ఫ్లోరిస్ట్కు రూ.6వేలు, సంతోష్ ఎంటర్ప్రైజెస్కు రూ.7,200 చొప్పున ఖర్చులకు మంజూరు చేసింది. అన్ని సౌకర్యాలు ఉండే ప్రజాభవన్ లో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వం బిల్లు చెల్లించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఒక్కరోజు ఎంపీ ల సమావేశానికి ప్రభుత్వం ఈ స్థాయిలో నిధులు వెచ్చించడం…. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలు సహా బిల్లులను విడుదల చేయకపోవడం… వంటి అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి. రాజుల సొమ్ము రాళ్లపాలు అనేది నానుడిగా ఉండటం… మనం ఈ బిల్లును పరిశీలిస్తే ప్రజల సొమ్ము…. ప్రజా ప్రతినిధుల పాలు అన్న చందంగా మారింది.







Leave a Reply