పంచాయతీ ఎన్నికల్లో ఎవరి లెక్కలు వారివే
ప్రతిపక్షాలపై కాంగ్రెస్ బీసీ అస్త్రం
మిగిలిన స్థానిక ఎన్నికలు జూలై తరువాతే….?
(హైదరాబాద్, న్యూస్ ఇన్)
తెలంగాణాలో ఇక వరుసగా ఎన్నికలు ఉంటాయని భావించినా….. ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదన్న సంకేతాలు ఇస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 70శాతం స్థానాలను గెలుచుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు వెల్లడించడంతో…ఇక వరుసగా జడ్పీటీసీ,ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికలు ఉంటాయన్న లీకులు కూడా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాయి. తాజా పరిస్థితులు చూస్తూంటే ఇది కూడా సాధ్యం కాకపోవచ్చన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కూడా అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేసే అంశంగా మారింది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతే ఎన్నికలకు వెళుతామని గతంలో కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇది అధికారికంగా సాధ్యం అయ్యే పరిస్తితి లేకపోవడంతో….. పార్టీల వారిగా ఎవరికి వారు ఇవ్వాలన్న వాదనను హస్తం నేతలు తెరపైకి తెచ్చారు. ప్రధాన రాజకీయ పక్షాలు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

చట్టపరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే…మా పార్టీలకు చెప్పడానికి హస్తం నేతలు ఎవరంటూ రివర్స్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు పెట్టే విధంగా మారింది.త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలకు ఈ వ్యవహారాన్ని అపాదిస్తూ సేఫ్ గా బీసీ రిజర్వేషన్ల అంశం నుంచి బయటపడాలని అధికార పార్టీ పావులు కదిపేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.కానీ ప్రతిపక్ష పార్టీలు బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం చట్టపరంగానే రిజర్వేషన్లను అమలు చేయాలని అధికార పార్టీని టార్గెట్ చేయనున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఎటూ తేలేలా కనిపించకుండా పోయే అవకాశాలున్నాయి.
ఈ ప్రభావం మున్సిపల్, జడ్పీ టీసీ,ఎంపీటీలపై కూడా చూపే అవకాశం ఉంటుంది. అధికార పార్టీకి రిజర్వేషన్ల విషయంలో రాజకీయంగా కలిసి వచ్చేలా ఉంటే తప్ప ఈఎన్నికలకు వెళ్లే అవకాశం దాదాపు లేదని తెలుస్తోంది. దీంతో పాటు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 70 శాతం స్థానాలను గెలుచుకున్నామని సీఎం సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ కూడా దాదాపు 40 శాతం స్థానాలు గెలుచుకున్నామని చెబుతోంది. బీజెపి కూడా వారి సంఖ్య చెబుతోంది.పార్టీల గుర్తులపై జరగని ఎన్నికల కావడంతో ఎవరి వాదన వారికి ఆనందం ఇస్తోంది. కానీ అధికార పార్టీ ఊహించిన స్థానాలు మాత్రం దక్కలేదనే చర్చ జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో పార్టీల గుర్తులతో జరిపే ఎన్నికలకు ఇప్పటికప్పుడే వెళ్లే సాహసం ప్రభుత్వం చేయకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే నాటికి జనవరి మొదటి వారం అవుతోంది. ఆ తరువాత నెల రోజుల్లో అంటే ఫిబ్రవరి రెండో వారం లోపు ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఇది సాధ్యం కాకపోతే ఎన్నికలు జూలై, ఆగస్టు నెలలకు వెళ్లే అవకాశం ఉందని సీనియర్ నేతలు పలువురు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇంటర్, 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీంతో మార్చి ఏప్రిల్ నెలల వరకు పరీక్షల సీజన్ కొనసాగనుంది.ఈ సమయంలో ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపక పోచ్చు. ఏప్రిల్, మే,జూన్ నెలలు వేసవి ప్రభావంతో గ్రామాలు ,పట్టణాల్లో విద్యుత్ కోతలు, నీటి ఎద్దడి సహజంగానే ఉంటుంది…ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సాహాసం చేయక పోవచ్చన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ కారణాలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలన్నీ పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో...అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకుంటాయి. ఇక్కడ తేడా వస్తే అధికారపార్టీకే చిక్కులు తప్పవు. ఈపరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం అంత సులువుగా నిర్ణయం తీసుకునే అవకాశంలేదని తెలుస్తోంది. పరిస్థితులు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే ఎన్నికలను వచ్చే ఏడాది జూలై తరువాత నిర్వహించుకునే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








Leave a Reply