సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
డిసెంబర్ 8 నుంచి భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా ఆర్థిక సదస్సు అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు . రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే “తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్” ను ఆవిష్కరించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని అన్నారు.ప్రజా భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లు , వరుసగా రెండు రోజుల ప్రోగ్రాం షెడ్యూల్ గురించి అధికారులు సీఎం కు వివరించారు

విజన్ డాక్యుమెంట్ను తుది రూపు ఇచ్చేందుకు సీఎం పలు సూచనలు చేశారు.భవిష్యత్ వృద్ధి ప్రణాళికలను ప్రాధాన్యంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్గా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రదర్శించాలనే తన ఆలోచనను సీఎం వివరించారు.

విజన్ డాక్యుమెంట్ను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచి పారదర్శకతకు, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.దావోస్లో జరిగే ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో తెలంగాణ సామర్థ్యాన్ని, అభిలాషను, వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రతిపాదించేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను రూపుదిద్దాలని స్పష్టం చేశారు.తదనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో కలిసి ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన సమ్మిట్ వార్ రూమ్ను సందర్శించి, సమీక్షించారు.



Leave a Reply