
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహా ఇతరులకు కోర్టు రిమాండ్ విధించింది. శనివారం రాత్రి పైలెట్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్ పై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చే|శారు. ఈ సందర్భంగా ఫాం హౌస్ లో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. పోలీసులు వస్తున్నారని గమనించిన నమీత్ శర్మ గాలిలోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరుపడంతో భారీఎత్తున పోలీసులు ఫాం హౌస్ కు చేరుకుని అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. 11 మంది అక్కడ పార్టీ చేసుకుంటుండంతో పోలీసులు పక్కా సమాచారంతో పైలెట్ ఫాం హౌస్ పై రైడ్ చేశారు. అక్కడిక్కడే ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తే కొంత మందికి డ్రగ్ తీసుకున్నట్లు ఖరారైంది.

అయినా పోలీసులు ఈకేసులో బ్లడ్ శాంపిల్స్ తీసి మరో సారి టెస్టులు నిర్వహించారు. దీంతో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహా మరి కొంత మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొంత మందిని స్టేషన్ బేయిల్ పై విడుదల చేసి పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితీష్ రెడ్డి, నమీత్ శర్మను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. రోహిత్ , రితీష్ లపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయగా, నమీత్ శర్మపై ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారని న్యాయ వాదులు వెల్లడించారు. 14 రోజుల రిమాండ్ మెజిస్ట్రేట్ విధించడంతో పోలీసులు ఈ ముగ్గురిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో కాల్పులు జరుపడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు.






Leave a Reply