పొలిటికల్ హీట్ పుట్టించనున్న కృష్ణా జలాలు
(హైదరాబాద్, న్యూస్ఇన్)
తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడి వేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావడంతో రెండేళ్లలో సాధించిన పురోగతిని అసెంబ్లీ వేదికగా వినిపించేందుకు అధికార పక్షం రెడీ అయింది.

ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్దం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిందన్న ఆరోపణలను విపక్షాలు చేస్తున్నాయి. అయితే సర్కార్ అభివృద్ధి జపాన్ని చేస్తోంది.
గత పదేళ్లతో పోలిస్తే రాష్టంలో రెండేళ్లలోనే సమర్దవంతంగా చేపట్టిన పురోగతిని వివరించేందుకు రెడీ అవుతోంది. ఈ సమావేశాల్లో కృష్ణా జలాలే హీట్ పుట్టించే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిక్షమైన గులాబీ పార్టీ కృష్ణ జలాలపై పోరు బాట పట్టేందుకు రెడీ అవుతోంది. కొన్ని రోజుల క్రితం మాజీ సీఎం కేసిఆర్ పార్టీ నేతలతో ఇందుకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు మొదలు పెట్టారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవహారాన్ని మాజీ మంత్రి హరీష్ డీల్ చేయనున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఇప్పటికే అన్ని అస్త్రాలను బీఆర్ ఎస్ రెడీ చేసుకుంది. 45 టీఎంసీ ల నీటి వాటా కోసం ప్రభుత్వం అంగీకరించిందని వీటితో ఏ జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశం లేదన్న వాదనను బీఆర్ ఎస్ తెరపైకి తెస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తత పరిస్థితికి బీఆర్ ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. పదేళ్ల బీఆర్ ఎస్ కారణంగానే నీటి వాటాల్లో అన్యాయం జరిగిందంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణా ఏర్పాటైన పదేళ్లలోనే అన్యాయం జరిగిందన్నారు.

అయితే రెండు ప్రధాన పార్టీలను ఇరుకున పెట్టే విధంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా తెలంగాణాకు నీటి వాటాల్లో అన్యాయం జరిగేలా చేస్తోందని ఆరోపిస్తోంది. కేంద్రం ముందు సరైన వాదనలు వినిపించడంలో ఇరు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్న వాదనను బీజెపి తెస్తోంది. ఈ అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత వెదిరె శ్రీరాం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించారు.



Leave a Reply