అనుమతులు వచ్చాయి…ఆచరణే మిగిలింది
చంద్రబాబుకు గోదావరి జలాల గురుదక్షిణ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఓ వైపు కృష్ణా జలాల్లో ప్రభుత్వ నిర్లక్య వైఖరి ఉందని ఆరోపణలు చేస్తున్న బీఆర్ ఎస్ మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను కూడా 200 టీఎంసీలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరలించేందుకు అనుమతి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావ్ వెల్లడించారు. ఈ అనుమతులతో ఏపీ నల్లమలసాగర్ పేరుతో నీటిని తరలించేందుకు రెడీ అవుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి గోదావరి జలాల తరలింపు పై అనుమతి వచ్చిన విషయం తెలుసా లేదా అని ప్రశ్నించారు. కేంద్రం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడంతోనే కేంద్రం అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు.

రేవంత్ రెడ్డి పాత్రధారి….
ఈ వ్యవహారంలో సూత్రధారిగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే….పాత్రధారిగా రేవంత్ రెడ్డి ప్రణాళికలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి తన గురు దక్షిణ చెల్లించేందుకు తెలంగాణాకే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. బనక చర్లపై బీఆర్ఎస్ ముందస్తు హెచ్చరికలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ అంశాన్ని వెల్లడించడంతో….

కాంగ్రెస్ కుట్ర బయటపడిందన్నారు.గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణాలో కలుపకుండానే, పెన్నా బేసిన్ కు గోదావరి నీటిని తరలించే పెద్ద కుట్రను రేవంత్ రెడ్డి అమలు చేసేందుకు రెడీఅవుతున్నారన్నారు.

బాబు ఏజెంట్ ఆదిత్యనాథ్ దాస్
నీటి తరలింపు కుట్రలో భాగంగా చంద్రబాబు సూచించిన ఆదిత్యనాథ్ దాస్ అనే తెలంగాణా ద్రోహికి రేవంత్ రెడ్డి సలహాదారు పదవి కట్టబెట్టారన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి ట్రిబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా పోలవరం విస్తరణ పనులు చేపట్టి, సామర్థ్యానికి మించి గోదావరి జలాలు తరలించే కుట్రలు చేసింది ఆదిత్యానాథ్ దాసే అని ఆరోపించారు.ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని ఉద్యమ ద్రోహిగా గుర్తిస్తే..ఇక పై జలద్రోహిగా కూడా మారిపోతున్నారన్నారు.
అసెంబ్లీ లో మరింత హీట్
హరీష్ రావ్ చేసిన ఆరోపణలు మరోసారి పొలిటికల్ హీట్ పెంచేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో రాజకీయ పార్టీలు తమ వాదనలను బలంగా వినిపిస్తుండగా….తాజాగా నల్లమల సాగర్ కూడా ఇదే జాబితాలో చేరింది.











Leave a Reply