ప్రతీ పది రోజులకు గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్
ప్రతి నెల సమీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)

హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.నగరంలో అత్యంత సంక్లిష్టమైన చెత్త నిర్వహణ సమస్యను సమర్థవంతంగా అధిగమించాలన్నారు. సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నామని, సిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (CURE) ఏరియాను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే క్యూర్( CURE) పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని, పరిపాలనను పట్టాలెక్కించాలనేదే తమ ఆలోచన అని సీఎం తెలిపారు. నెలకు మూడు రోజులు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడా, రోడ్లపై గుంతలు కనిపించకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

స్మార్ట్ గవర్నెన్స్ అమలు…
జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ఆన్ లైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని తెలిపారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్ మెంట్ అసోసియేషన్ లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. సుపరిపాలనతో పాటు స్మార్ట్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.

నెలకు ఒకసారి సమీక్ష
క్యూర్ పరిధిలోని 12 జోన్లలో చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆక్రమణలను తొలగించి వర్షాకాలంలో వరదలతో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద చెరువులను గుర్తించి వాటిని పునరుద్దరించి యాక్టివిటీ జోన్స్ గా అభివృద్ధి చేయాలని సూచించారు. నెలకు ఒకసారి జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.




Leave a Reply