NewsInn

News in a Click

మా వాద‌న‌తో ఏపీ ఉక్కిరి…భిక్కిరి : సీఎం

మా వాద‌న‌తో ఏపీ ఉక్కిరి…భిక్కిరి : సీఎం

ప్ర‌జాభ‌వ‌న్ లో ప్ర‌భుత్వం ట్రైల‌ర్ షో

అసెంబ్లీలో ఫుల్ సినిమానే

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

అసెంబ్లీ స‌మావేశాలు కృష్ణా, గోదావ‌రి జలాల వినియోగంపై వాడి వేడిగా జ‌రుగ‌నున్నాయి. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నీ నీటి వాటాల‌తో నిప్పులు పుట్టించేందుకు రెడీ అవుతున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఈ రోజు ప్ర‌జాభ‌వ‌న్ లో త‌మ పార్టీ నేత‌ల‌కు కృష్ణా జ‌లాల వాట‌పై పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ ఇచ్చింది. మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చేసిన ఈ పీపీటీకి ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జ‌లాల్లో బీఆర్ ఎస్ చేసిన అన్యాయాన్ని స‌రిదిద్దేందుకు త‌మ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని,త‌మ వాద‌న‌లో ఏపీ ప్ర‌భుత్వం ఉక్కిరి భిక్కిరి అవుతోంద‌న్నారు. తెలంగాణాలో ప‌దేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ నీటి వాటాల విష‌యంలో వందేళ్ల వ‌ర‌కు అన్యాయం జ‌రిగేలా చేసింద‌ని సీఎం ఆరోపించారు. నికర జలాలలో తెలంగాణా కు 299 టీఎంసీ లు,ఏపీ కి 511 టీఎంసీ పంపకానికి ఒప్పుకుంటూ కేసీఆర్ సంతకం చేశారన్నారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను ఏపీ ముందుకు పోనివ్వడం లేదన్నారు.పరివాహక ప్రాంతం ఆధారం గా తెలంగాణ కు 79 శాతం,ఏపీ కి 21 శాతం వాటా ఇవ్వాలని మేము వాదిస్తున్నామ‌ని సీఎం చెప్పారు.

దీని ప్ర‌కారం తెలంగాణాకు 555 టీఎంసీల నీటి వాటా రావాల‌న్న‌ది త‌మ వాద‌న సారంశం అన్నారు. ఈ వాద‌న‌తోనే ఏపీ ఉక్కిరి భిక్కిరి అవుతుంద‌ని సీఎం వ్యాఖ్య‌లు చేశారు. కృష్ణా జ‌లాల్లో బీఆర్ ఎస్ చేసిన త‌ప్పిదాన్ని క‌ప్ప పుచ్చుకునేందుకు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు అంశాన్ని హ‌రీష్ రావు తెర‌పైకి తెస్తున్నార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ తీరును మేము ఎండ‌గ‌డితే ఆ పార్టీని ప్ర‌జ‌లు జ‌ల‌స‌మాధి చేస్తార‌ని, ఈ కార‌ణంగానే త‌ప్పుడు ప్ర‌చారాలు చేసేందుకు బీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ఉన్న ఆదిత్య‌నాథ్ దాస్ గురించి విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. గ‌త 10 ఏళ్లుగా ఆయ‌న తెలంగాణా సాగునీటి ప్రాజెక్టుల‌పై ప‌నిచేస్తున్నార‌ని సీఎం వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసిఆర్ అసెంబ్లీకి వ‌చ్చి త‌న అనుభ‌వాన్ని పంచుకోవాల‌ని రేవంత్ కోరారు. కేసిఆర్ గౌర‌వానికి భంగం క‌లుగ‌నియ్య‌మ‌న్నారు.

పాల‌మూరు ప‌థ‌కానికి రు. 80 వేల కోట్లు కావాలి….

బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింద‌ని ప‌దేళ్ల‌లో కేవ‌లం 27 వేల కోట్ల రుపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసింద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్ లో వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 87 వేల కోట్ల రుపాయాలు అవ‌స‌రం ఉంటాయ‌న్నారు. కృష్ణా జ‌ల్లాల్లో తెలంగాణాకు 753 టీఎంసీల నీటిని కేటాయించాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌ని చెప్పారు.
90 టి.యం.సి ల నీటితో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పూర్తికి కట్టుబడి ఉన్నామ‌న్నారు. ఈ విష‌యంలో బీఆర్ ఎస్ చేస్తున్న ఆరోప‌ణ‌లు పూర్తిగా అర్ధ ర‌హిత‌మ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *