NewsInn

News in a Click

ఈ నెల 17న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కు సీఎం రేవంత్ రెడ్డి

రూ. 1200 కోట్ల అభివృద్ధి పనులు

(హైదరాబాద్, న్యూస్ఇన్)

ఐఐఐటి (IIIT), డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి కీలక ప్రాజెక్టుల ప్రారంభం

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా అభివృద్ధికి సంబంధించి సుమారు రూ. 1200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక ప‌నుల‌కు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పర్యటన జిల్లా విద్యా, మౌలిక వసతుల రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో చేపట్టే ప్రధాన కార్యక్రమాలు:

ఐఐఐటి (IIIT) కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన.

పట్టణంలో ఆధునిక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు పునాది.

జిల్లాకు శాశ్వత తాగునీటి సరఫరా పథకం ప్రారంభం.

ఎంవిఎస్ (MVS) కళాశాల నూతన భవన నిర్మాణ పనులకు శ్రీకారం.

ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు. సభా ప్రాంగణం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు.

సమీక్షా సమావేశం అనంతరం, ఐఐఐటి కళాశాల నిర్మాణం చేపట్టనున్న చిట్టబోయినపల్లి ప్రాంతాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్న ఎంవిఎస్ కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *