కేసీఆర్ తప్పిదంతోనే దుర్గతి
సోర్స్ లు మార్చడమే బీఆర్ ఎస్ తప్పిదాలు
నీటిపారుదల రంగంపై 1.83 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
గత ప్రభుత్వ పదేళ్ల కాలంలోనే రాష్ట్రంలో సాగు నీటి రంగం అస్తవ్యస్తంగా మారిందని శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ఇప్పుడు గగ్గోలు పెడుతోందని మంత్రి ఆరోపించారు. పదేళ్లలో నీటి పారుదల రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఉత్తమ్ ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చరిత్రాత్మక తప్పిదాలతోటే రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి ఇంతటి దుర్గతి ఏర్పడిందని దుయ్యబట్టారు.జూరాల నుండి రూపకల్పన చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం ప్రాజెక్టు ను శ్రీశైలంకు మార్చడంతో పాటు తమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మెడిగడ్డకు మార్చడమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన చరిత్రాత్మక తప్పిదాలకు నిదర్శనమన్నారు.

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను ముందుకు కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ ముద్ర పడుతుందన్న దురుద్ధేశంతోటే బి.ఆర్.ఎస్ పాలకులు మార్పులకు శ్రీకారం చుట్టారని విమర్శించారు.బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో లక్షా 83 వేల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేసినప్పుటికీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేక పోయారని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటే 80,000 నుండి 84,000 వరకు అంచనా చేరుతుందని దీనికి గత ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే బి.ఆర్.ఎస్ నేతలు అందుకు భిన్నంగా 90 శాతం పనులు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారన్నారు. నిజానికి అంచనా వ్యయంలో కేవలం 25 నుండి 30 శాతం నిధులు ఖర్చు పెట్టి 90 శాతం పనులు పూర్తి అయ్యాయి అంటూ అబద్ధాలు ప్రచారం చేయడం ముమ్మాటికి దక్షిణ తెలంగాణా ప్రజలను మోసం చేయడమే నన్నారు.ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు కూడా గత ప్రభుత్వం మార్చి రీడిజైన్ చేయడం చారిత్రాత్మక తప్పగా ఉత్తమ్ చెప్పారు. కాళేశ్వరం పేరుతో నిర్మించడంతోటే ఇంతటి ఆర్థిక విపత్తు సంభవించిందన్నారు.పైగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగాలైన మెడిగడ్డ తో సహా మొత్తం మూడు బ్యారేజ్ ల పరిస్థితి ఏమిటో అన్నది తెలంగాణా సమాజానికి తెలిసిన విషయమే అన్నారు.

ఈ ప్రాజెక్టు మొత్తం నిరుపయోగంగా మారిందన్నారు. నీళ్లు-నిధులు-నియమకాల పేరుతో ఏర్పడ్డ రాష్ట్రంలో పదేళ్ళ పాటు సాగిన బి.ఆర్.ఎస్ పాలనలో ఆంద్రప్రదేశ్ ప్రదేశం అక్రమంగా నీటిని దోచుకు పోయారని అందుకు బీఆర్ ఎస్ పాలకులు బాధ్యత వహించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కుడా ఆంధ్ర ప్రాంతానికి ఇంత స్థాయిలో నీటి కేటాయింపులో జరగలేదన్నారు. బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న సమయంలో టెలిమెట్రీ పరికరాలు అమర్చి ఉంటే నీటి దోపిడికి అడ్డు పడి ఉండేదన్నారు.



Leave a Reply