బీఆర్ఎస్ నీటి వాటాలకు మరణ శాసనం రాసింది
తోలు తీస్తామన్నారు….బట్టలూడదీస్తామన్నారు…పారిపోయారు
తెలంగాణాకు అన్యాయం జరుగనివ్వను
సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలోనే తెలంగాణా ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున మంజూరయ్యాయని వాటిని సద్వినియోగం చేసుకోవడంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు తెలంగాణాకు మరణ శాసనంగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగం విషయంలో వ్యవహరించిన తీరు కారణంగానే రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చపై సీఎం ప్రసంగిస్తూ బీఆర్ ఎస్ అనుసరించిన విధానాలను తప్పు బట్టారు.

అసెంబ్లీలో చర్చలంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుందని, వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని అంతా విశ్వసిస్తారని ఇలాంటి చర్చల సందర్బంగా బీఆర్ ఎస్ దూరంగా ఉండడంతో ఆ పార్టీ వైఖరి ప్రజలకు తెలిసి పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు వల్ల తెలంగాణాకు అన్యాయం జరుగుతోంది….తోలుతీస్తాం అన్న నేతలు అసెంబ్లీ చర్చల్లో పాల్గొనలేదన్నారు. బట్టలూడదీస్తామని ప్రకటించారు….ఇక్కడ చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీసే వారో తెలిసి పోయేదన్నారు. బీఆర్ ఎస్ సర్కార్ పదేళ్లలో తెలంగాణాకు నీటి వనరులను వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు.2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్లో ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టింది.

2014లో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. 490 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయిస్తే.. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కేసిఆర్ , హరీష్ రావు లు తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారన్నారు.2015 జూన్లో జరిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో 299 టీఎంసీలకు అంగీకరించారు. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలల్లో తెలంగాణకు 490 టీఎంసీలు అడగాల్సిందిపోయి 299 టీఎంసీలకు ఒప్పుకుని సంతకం పెట్టారని సీఎం వెల్లడించారు.ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోట్లాడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సాధించుకున్నారని చెప్పారు. ఆ సమయంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న కెసీఆర్ పాలమూరు ఎత్తిపోతల ఇవ్వాలని ఒక్క రోజు అడగలేదన్నారు.ఏ నైతిక హక్కుతో కేసీఆర్ ఈ పథకంపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాను బ్రతికి ఉన్నంత వరకు తెలంగాణా అభివృద్ధిలో ఎక్కడా అన్యాయం జరుగనివ్వని సీఎం వ్యాఖ్యలు చేశారు



Leave a Reply