NewsInn

News in a Click

సికింద్రాబాద్ కార్పోరేష‌న్ డిమాండ్

సికింద్రాబాద్ కార్పోరేష‌న్ డిమాండ్

ఆందోళ‌నల‌కు సిద్ధం అవుతున్న‌ అఖిల‌ప‌క్షం

11వ తేదీన ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ

మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పోరేష‌న్ ను విస్త‌రిస్తూ విభ‌జించాల‌ని ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తుండ‌డంతో ఇదే అద‌నుగా ప్ర‌భుత్వం పై వ‌త్తిడి పెంచేందుకు సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని నేత‌లు అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ డిమాండ్ ను ఇప్పుడు సాధించేందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మంత‌నాలు జ‌రుపుతున్నారు. మాజీ మంత్రి త‌ల‌సాని నేతృత్వంలో ఈ రోజుల క‌లిసి వ‌చ్చే వివిధ పార్టీల నేత‌ల‌తో ప్రాథ‌మికంగా జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈనెల 11వ తేదీన కీల‌క స‌మావేశాన్ని ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా ఆందోళ‌న‌ల‌కు శ్రీకారం చుట్టాల‌ని నేటి స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ సందర్భంగా త‌ల‌సాని మాట్లాడుతూ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 17 వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 10 వేల మందితో భారీ ర్యాలీగా బయలుదేరి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ మీదుగా MG రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేరుకుంటుందని వివరించారు. భారీ ర్యాలీని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణ పై 11 వ తేదీన నిర్వహించే సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు, విద్యావంతులు, కాలనీలు, బస్తీల కమిటీ లు, వ్యాపార వాణిజ్య సంఘాలు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బతీస్తామంటే చూస్తూ సహించబోమని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని విస్మరిస్తుందని ఆరోపించారు. జంట నగరాలు అంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలు ప్రసిద్ది పొందాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం లో ఉన్నామనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరిచి రాచరిక పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. సికింద్రాబాద్ ప్రాంతానికి ఉన్న చరిత్రను పట్టించుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పేరుతో మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసే వరకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటాలు చేస్తామని ప్ర‌క‌టించారు. తమ ఆందోళన కార్యక్రమంలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, కలిసొచ్చే రాజకీయ పార్టీలు, కాలనీలు, బస్తీల కమిటీలు, కార్మిక, వ్యాపార, వాణిజ్య సంఘాలు ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *