నదీ జలాలపై అవగాహన లేని వ్యక్తి సీఏం
రేవంత్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి అవమానం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాస్వామ్యానికి అవమానం కలిగేలా ఉందని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలో ఉరిశిక్షల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, మాట తప్పిన హామీలకు లెక్క వేస్తే కాంగ్రెస్ నాయకులను ఎన్నిసార్లు ఉరితీయాలో కూడా తెలియదన్నారు. అశోక్ నగర్ అడ్డా మీద రెండు లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చని రాహుల్ గాంధీపై, రైతు రుణమాఫీ హామీ అమలు చేయని వరంగల్లో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ తప్పించినందుకు కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలు తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 420 హామీల ఎగవేతకు 420 సార్లు కాంగ్రెస్ను ప్రజలు శిక్షించాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.రేవంత్ రెడ్డికి తిట్టడం తప్ప మరో భాష రాదని, కానీ తాము కావాలంటే మూడు నాలుగు భాషల్లో సమాధానం చెప్పగల శక్తి ఉందన్నారు. IITకి, IIITకి తేడా తెలియదని, బచ్చావత్ ట్రిబ్యునల్కు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియని అజ్ఞానం ఉన్న వ్యక్తి తెలంగాణ భవితవ్యంపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నదీ జలాలపై కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా తెలంగాణకు చేస్తున్న ద్రోహాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు

కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తికి తెలంగాణకు ఏం కావాలో ఎలా తెలుస్తుందన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని అజ్ఞాని, ఉష్ట్రపక్షి పాలన ఇది అని కేటిఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటికే వందలాది రైతులు, ఆటో డ్రైవర్లు, గురుకుల విద్యార్థులు, నేతన్నలు ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వికృతమైన మాటలతో కేసీఆర్ స్థాయిని తగ్గించలేడని కేటిఆర్ అన్నారు. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నది కేవలం నేటి సమస్య కాదని, నిజాం కాలం నుంచి ఈ ద్రోహం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదని, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అహంకారం, ద్రోహపూరిత విధానాలను ప్రజల ముందు నిరంతరం ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలే తప్ప అభివృద్ధి లేదన్నారు. పేదల ఇళ్లను కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టని ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్, సర్వే సర్వత్రా విఫలమైన సర్వభ్రష్ట ప్రభుత్వం ఇదేనని, అలాంటి ప్రభుత్వానికి అధినేతగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర దౌర్భాగ్యమని కేటిఆర్ వ్యాఖ్యానించారు.



Leave a Reply