NewsInn

News in a Click

అధికార పార్టీకి అండ‌గా మాట్లాడ‌డం స‌రికాదు

కేసిఆర్ లేకుంటే క‌విత ఎవ‌రు ?

క‌విత‌కు బీఆర్ఎస్ మ‌హిళా నేత‌ల కౌంట‌ర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కేసిఆర్ కూతురుగా అన్నీ అనుభ‌వించి గులాబీ పార్టీ ప్ర‌తిప‌క్ష‌పార్టీగా మార‌డంతో తండ్రి స్థాపించిన పార్టీపైనే ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని బీఆర్ ఎస్ మ‌హిళా నేత‌లు వ్యాఖ్య‌లు చేశారు. క‌విత ఎవ‌రో ఆడిస్తే ఆడే కీలు బొమ్మ‌గా వ్య‌వ‌హ‌రించ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. మీ వెనుక ఎవ‌రు అనే దానిపై అంతా చ‌ర్చ జ‌రుగుతుంద‌న్నారు. జ‌నం బాట పేరుతో కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుండం భావ్యం కాద‌ని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత‌,మాజీ జ‌డ్పీ చైర్మ‌న్ తుల ఉమ‌, టీఎస్పీఎస్సీ మాజీ స‌భ్యురాలు సుమిత్రా నంద్ లు తెలంగాణా భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. శాస‌న‌మండ‌లిలో మాట్లాడుతూ కంట‌త‌డి పెట్ట‌డం వ్య‌క్తి గ‌త కార‌ణాలే అని చెప్పారు. కేసిఆర్ ద‌గ్గ‌ర క‌విత‌కు ఉన్న చ‌నువు ఎవ‌రికీ లేద‌ని,న‌చ్చిన వారికి ప‌ద‌వులు ఇచ్చినప్పుడు ప్ర‌జాస్వామ్యం గుర్తు రాలేదా అని మ‌హిళానేత‌లు ప్ర‌శ్నించారు.బీఆర్ ఎస్ పార్టీని త‌ప్పుబడుతున్న క‌విత జాగృతి పేరును భార‌త జాగృతిగా ఎందుకు మార్చుకున్నారో చెప్పాల‌న్నారు.

Brs Mahila leaders press meet

మీకంటే సీనియర్ అయిన వినోద్ కుమార్ కాదని ఎంపీగా ఓడి పోతే వెంట‌నే ఎమ్మెల్సీ ప‌ద‌విని కేసిఆర్ ఇచ్చిన విష‌యం గుర్తులేదా అని అన్నారు. హ‌రీష్ రావ్ లాంటినేత వ్యక్తిగత విషయాలతో ప్ర‌స్తావించ‌డం మంచిది కాద‌ని హిత‌వు చెప్పారు. జనం బాట పేరుతో బీ ఆర్ ఎస్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చ‌రించారు. పార్టీ శ్రేణులు ఆగ్ర‌హిస్తే క‌విత గ్రామాల్లో తిర‌గ‌లేద‌న్నారు. ఉద్య‌మ‌కారుల ప‌ద‌వులు గురించి మాట్లాడుతున్న నీవు ఉద్య‌మం మొద‌లైన ఆరేళ్ల‌కు ఉద్య‌మంలో అడుగు పెట్టిన విష‌యం మ‌ర్చి పోయావా అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. బీఆర్ఎస్ లో ఉన్న‌న్ని రోజులు పార్టీ నేత‌ల మ‌ద్ద‌తు లేనిదే జాగృతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిందా అని క‌విత‌ను మ‌హిళా నేత‌లు ప్ర‌శ్నించారు. మ‌ద్యం కేసు కాక ముందు వ‌ర‌కు దేశ వ్యాప్తంగా ఆప్ పార్టీ అన్నా….కేజ్రీ వాల్ అన్న గౌర‌వం ఉండేద‌ని ఆ పార్టీని లిక్క‌ర్ స్కాంలోకి లాగడంతో పార్టీ ప‌రిస్థితి క‌విత వ‌ల్లే పూర్తిగా దిగ‌జారి పోయింద‌ని విమ‌ర్శించారు. కేసిఆర్ కూతురు కాక‌పోతే క‌వితకు గుర్తింపు ద‌క్కేదా అని క‌విత చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై మ‌హిళానేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *