దాదాపు గంట సేపు చర్చలు
8వ తేదీ సమావేశం ఎజెండా
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రాథమికంగా సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. దాదాపు గంటసేపు సీఎంతో భేటీ అయిన మహేష్ రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఏక పక్షంగా విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ చేసినట్లు సమాచారం.

అందులో భాగంగా ఈ నెల 8వ తేదీన గాంధీ భవన్ లో టీపీసీసీ విస్త్రృత స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండా అంశాలపై కూడా చర్చ ఇద్దరు నేతల మధ్య జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు….. సాగునీటి అంశంలో కృష్ణ, గోదావరి జలాల పీపీటీ విషయంలో ప్రజలకు సమగ్ర సమాచారాన్ని అందించినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సీఎంకు తెలియచేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పై చేయాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం విషయంలో నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్, వార్డ్ ఆభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ప్రతి వార్డు, డివిజన్ ల నుంచి 6 గురు చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి సర్వే నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేయాలని సేచించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఎక్కువగా చర్చ జరిగినట్లు సమచారం.






Leave a Reply