(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నారు. అధికార పార్టీ శాసనసభ్యులను ఆపరేషన్ ఆకర్ష్ తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన పూర్తయింది. మరోసారి ఎన్నికలకు సిద్ధం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా సిద్ధం అవుతోంది. మరోసారి అధికారం దక్కించుకుంటామంటూనే సీఎంగా మరోసారి పదవి చేపడుతానని సీఎం రేవంత్ అవకాశం వచ్చినప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను రాజకీయాల్లో తమకు అనుకూలంగా మలుచుకునేందుకు గులాబీ పార్టీ ఇప్పటి వరకు వేచి చూసింది. ఇప్పుడు ఆ పరిస్థితి రానే వచ్చిందని బీఆర్ ఎస్ భావిస్తోంది.ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడిగి గుర్తింపు దక్కించుకుని జగిత్యాలలో రెండో సారి ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న డాక్టర్ సంజయ్ ను హస్తం పార్టీలో చేర్చకుని బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో అప్పట్లో భారీ ఊహాగానాలు వినిపించాయి.
బీఆర్ ఎస్ కు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్….

కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేనే పార్టీ వీడితే రాబోయే రోజుల్లో బీఆర్ ఎస్ పార్టీ నుంచి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు కారెక్కడం ఖాయమని ప్రచారం జరిగింది. 2014, 2018 బీఆర్ ఎస్ అనుసరించిన వ్యూహాన్ని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడం మొదలు పెట్టారని కూడా రాజకీయ చర్చలు జరిగాయి.
కానీ ఆ తరువాత రాజకీయంగా పరిస్థితులు సీఎం కు కలిసి రాలేదు…. సీఎం అమలు చేయాల్సిన వ్యూహాలు పదిమంది ఎమ్మెల్యేలకే పరిమితం అయ్యాయి. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల వేరు కుంపటి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ హై కమాండ్ ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. 10 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను హస్తం పార్టీలో చేర్చుకున్నామన్నా అనందం క్రమంగా హస్తం పార్టీకి దూరం అవుతూ వస్తోంది.
రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో బీఆర్ఎస్…….

ఇక స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యంతో వలస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల వైరుధ్యాలు బయటపడుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది…అయితే కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే జగిత్యాల నియోజవర్గంలో రాజకీయ పరిణామాలు మరింత వేడి పుట్టించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతో జీవన్ రెడ్డి రాజకీయ అనుభవానికి తన అధికార దర్పంతో చెక్ పెడుతూ వచ్చారు. ఎన్నో సార్లు పార్టీ పెద్దలతో చర్చించినా మాజీ మంత్రికి ఎక్కడా ఊరట దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ పెద్దల హామీలు ఒకటైతే నియోజకవర్గంలో రాజకీయం మరోలా కొనసాగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లకు పైగా రాజకీయం చేసిన సీనియర్ నేత నియోజకవర్గ పరిస్థితులతో విసిగిపోయారు. అడుగడునా అవమానాలు భరించలేనంటూ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. గత నెలలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించారు.
కేసీర్ తో జీవన్ రెడ్డి భేటీ….

ఇక రంగంలోకి దిగిన బీఆర్ ఎస్ జగిత్యాలలో పట్టు దక్కించుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావితం చేసే విధంగా గులాబీ పార్టీ పావులు కదిపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి చక్రం తిప్పారు. ఇక్కడ బీజేపీ కూడాఎంటర్ అయినా….ఆ పార్టీవైపు వెళ్లకుండా బీఆర్ ఎస్ పావులు కదిపింది. దీంతో జీవన్ రెడ్డి కారెక్కేందుకు సై అన్న సంకేతాలు ఇచ్చారు.దీంతో పార్టీ అధినేత కేసీఆర్ జీవన్ రెడ్డి సహా కీలక నేతలకు లంచ్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా ఇద్దరు నేతల మధ్య భేటీ జరిగింది. దాదాపు ఐదు గంటల చర్చల అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన పార్టీ బహిరంగసభ జగిత్యాలలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుందని ఆ సభలోనే తాను బీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.
ప్రజల పక్షాన పోరాటం….

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తాము చర్చ జరిగినట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. ఏ ఒక్క విషయానికి తమ చర్చ పరిమితం కాలేదన్నారు. అన్ని అంశాలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని జీవన్ర ఎడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తప్పు బట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు హై కమాండ్ నడుచుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.









Leave a Reply