రవాణా వ్యయం తగ్గించేలా రహదారి ప్రాజెక్టులు
సమీక్షలో చంద్రబాబు

(అమరావతి,న్యూస్ఇన్)
రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం ఓడరేవులను ఈ జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచనలు జారీ చేశారు. ఈ పోర్టులకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సరుకు రవాణా చేసేలా హింటర్ ల్యాండ్ను కనెక్టు చేసేలా రోడ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో దేశంలోనే ఏపీ బెంచ్ మార్క్ గా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా, 6 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రస్తుతం రూ.42,194 కోట్ల విలువైన జాతీయ రహదారుల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగుళూరు-కడప- విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు 2027 కల్లా పూర్తి కావాలని ఆదేశించారు. ఖరగ్ పూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే కూడా త్వరలోనే డీపీఆర్ లు సిద్ధం చేయాలన్నారు.
రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ విస్తరణ..…..
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రహదారి నెట్వర్క్ ను మరింత విస్తరించేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి రహదారులు భవనాల శాఖను ఆదేశించారు. రూ.2500 కోట్లతో 6,054 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా రహదారుల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు వివరించారు. డేనిష్ ఫైబర్, వేస్ట్ ప్లాస్టిక్ బిటుమిన్, తిరుపతి ఐఐటీ రూపొందించిన నానో కాంక్రీట్ టెక్నాలజీ ద్వారా ప్రయోగాత్మకంగా రోడ్లను వేస్తున్నామని తెలిపారు.





Leave a Reply