భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
సీఎం చంద్రబాబు
(అమరావతి,న్యూస్ఇన్)
ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2027 డిసెంబరు నాటికి సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగొట్ల గ్రామంలో మీ భూమి- మీహక్కు కింద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భవిష్యత్ లో ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా, ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా ట్యాంపరింగ్ కు ప్రయత్నిస్తే నేరుగా జైలుకే వెళతారని, అవసరమైతే పీడీ యాక్టు కింద కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ…మీ భూమికి భద్రత కల్పించడం నాకు ఆనందాన్నిస్తోంది. భూమి ఆస్తి ఒక్కటే కాదు..అది మన జీవనాధారం. కుటుంబానికి భద్రత. భవిష్యత్కు నమ్మకం. కూటమి ప్రభుత్వం భూమి- నీరు-సాగుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఎకరాకు నీరు, లాభాలు తెచ్చిపెట్టేలా సాగును ప్రోత్సహించటమే లక్ష్యాలుగా పెట్టుకుని పనిచేస్తున్నాం.

రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే నా జీవితాశయం. కర్నూలు జిల్లాలో పశ్చిమ తాలూకాకు నీరు అందిస్తే రాష్ట్ర మంతటా నీరు ఇచ్చినట్టే. వారసత్వంగా వచ్చిన ఆస్తిపై వేరే వారి ఫొటోలు వేయడమేంటని గత ఎన్నికల్లో నేను ప్రశ్నించాను. గత పాలకులు తప్పుడు విధానాలతో ప్రజలను బానిసలు చేయాలని కుట్ర చేశారు. లోపభూయిష్టమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారు. ప్రజల జుట్టు వాళ్ల చేతుల్లో పెట్టుకుని ఆడించాలని చూశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై, పొలం సరిహద్దు రాళ్లపై వారి ఫొటోలు, పేర్లు ముద్రించుకున్నారు. వాళ్లు అడిగిన భూములు ఇవ్వకపోతే 22 ఏలో పెట్టారు. కక్ష తీర్చుకోవడానికి అన్ని ఆయుధాలు ఉపయోగించారు. ప్రజలను భయబ్రాంతులను చేసేందుకు పులివెందుల నుంచి మనుషులను తెచ్చుకున్నారు. రీ సర్వే పేరుతో రూ.700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలపై ఫొటోలు వేసుకోవడం శాడిజం కాదా? లక్షల ఎకరాల ప్రైవైటు భూములను ప్రభుత్వ భూములుగా మార్చేశారు. రికార్డులు తారుమారు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ పక్కన హెలీప్యాడ్ కోసం..70 ఏళ్లుగా పక్కా డాక్యుమెంట్లు ఉన్న భూమిని ఒక వ్యక్తి దగ్గర బలవంతంగా తీసుకుని ప్రభుత్వ భూమిగా మార్చేశారు. ఇదేమని అడిగితే 22 ఏలో పెట్టి వివాదం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల వద్ద నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 80 శాతం పైగా అర్జీలు రెవెన్యూ పరమైనవే వస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించి ఏమీ తెలీనట్టు గత ఐదేళ్లు బ్రహ్మాండంగా పాలన చేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు సమర్థవంతంగా పని చేస్తే ఇన్ని సమస్యలు ఎలా వచ్చాయి? నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను. నా జీవితంలో ఇలాంటి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదని” సీఎం చంద్రబాబు అన్నారు.







Leave a Reply