NewsInn

News in a Click

ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర- కేటీఆర్

ప్రజా సమస్యలపై 2027లో పాదయాత్ర- కేటీఆర్

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్)

రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై గులాబీ పార్టీ దృష్టి పెట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం కొత్త వ్యూహాల‌కు ప‌ద‌నుపెడుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌న్న ల‌క్ష్యంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ 2027 లో పాద‌య యాత్ర చేస్తాన‌ని వెల్ల‌డించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తూనే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు సిద్ధంమవుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

రాజకీయ, సంస్థాగత అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నియోజకవర్గాల డిలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెరుగుతాయని, దీనివల్ల బీఆర్ఎస్‌కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ పైన ఇప్పుడు ఉన్న సమాన రేషియోలో విభజన జరిగితే ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదు. పార్లమెంట్లో ప్రస్తుతం 24% ఎంపీల స్థానాల్లో వాటా ఉన్నది. అదే శాతం తగ్గకుండా డీలిమిటేషన్ జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, బీఆర్ఎస్ ఎప్పటిలాగే ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని, పొత్తులు తమకు కలిసిరావని స్పష్టం చేశారు. అలాగే ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎమ్మెల్యేలను మార్చగలిగితే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి పోటీ చేయమని తేల్చిచెప్పారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలే మాకు ముఖ్యం ఈ అంశంలో ఎలాంటి మొహమాటం పార్టీకి లేదు ఎవరు ఎక్కడ గెలుస్తారో అక్కడికి పంపిస్తాము.

గతంలో అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని లోపాలను కేటీఆర్ ఈ సందర్భంగా బహిరంగంగానే అంగీకరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు మండల స్థాయి నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో తాము విఫలమయ్యామని ఆయన పేర్కొన్నారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పటికీ, వారి ప్రయోజనాల కోసం సరైన ‘గల్ఫ్ పాలసీ’ని తీసుకురాలేకపోయామ‌న్నారు. పదేళ్ల పాలనలో పార్టీకి మరియు ప్రజలకు మధ్య దూరం పెరిగిందని అంగీకరించిన ఆయన, ఈసారి ఆ గ్యాప్‌ను తగ్గించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర నుండి అభ్యంతరాలు ఉన్నప్పటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించడం విచిత్రమన్నారు. జైలుకు వెళితేనే సీఎం అవుతారనేది ఒక భ్రమ మాత్రమేనని, నలభై ఏళ్ల క్రితం అలాంటి రాజకీయ సంస్కృతి లేదని, తాము హత్యలు చేసి అక్రమాలు చేసి జైళ్లకు వెళ్లేంత దుర్మార్గులం తాము కాద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *