పండగ సీజన్ నేపథ్యంలో అదనపు బుకింగ్ కౌంటర్లు
ముందుగానే స్టేషన్ కు చేరుకోవాలని సూచనలు
రైల్ వన్ యాప్ వినియోగంపై చైతన్యం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
సంక్రాతి ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది. పండుగ సమయంలో రోజుకు సగటున రోజుకు 2.20 లక్షల మంది ప్రయాణికులు, లింగంపల్లిలో 50,000 మంది మరియు చర్లపల్లి స్టేషన్లలో 35,000 మంది ప్రయాణికుల రాకపోకలు సాగుతాయని అంచనా వేసి ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని సరైన రీతిలో నిర్వహించడానికి , సికింద్రాబాద్ స్టేషన్లో అదనపు ఆపరేషన్స్ బృందాలను రైల్వే శాఖ ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ వెల్లడించారు. సంక్రాంతికి ప్రత్యేక రైల్లు, ఏర్పాట్లపై వివరాలు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు అన్ని స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద అదనపు టి.టి.ఈ లు మరియు ఆర్.పి.ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నట్లు తెలిపారు. డివిజనల్ హెడ్క్వార్టర్స్లో పటిష్టమైన సి.సి.టి.వి నిఘా కంట్రోల్ రూమ్ ఏర్పాటు తో పాటు నిరంతరం పనిచేసే విధంగా వార్ రూం ను నిర్వహించనున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనుల దృష్ట్యా ప్లాట్ఫారమ్ నంబర్ 1వైపు, పార్కింగ్ తాత్కాలికంగా మూసి వేశారు. పికప్/డ్రాప్-ఆఫ్ పరిమితంగా ఏర్పాటు చేయబడింది. సికింద్రాబాద్ స్టేషన్ పార్కింగ్ వద్ద బోయిగూడ ప్రవేశ ద్వారం (ప్లాట్ఫారమ్ నంబర్ 10 వైపు) వద్ద యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ను తాత్కాలికంగా ఎత్తివేసి, ప్రయాణీకుల కదలికను వేగవంతం చేశారు. ప్రయాణీకుల సులువైన రాకపోకల కోసం ప్లాట్ఫారమ్ నంబర్ 10 వద్దనున్న బేస్మెంట్ పార్కింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

07-01-2026 నుండి 20-01-2026 వరకు హైటెక్-సిటీలోని 16 రైళ్లకు మరియు చర్లపల్లి స్టేషన్లలో 11 రైళ్లకు అదనపు స్టాపేజ్ లు ఏర్పాటు చేయబడ్డాయి. లింగంపల్లి స్టేషన్లోని ప్లాట్ఫామ్ నెం.1 వద్ద బ్యాగేజ్ స్క్రీనింగ్ సౌకర్యాలు కల్పించబడ్డాయి ప్రయాణికులు ఆ స్టేషన్లలో స్టాప్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మరియు రద్దీ సమయాల్లో ముందుగానే స్టేషన్కు చేరుకోవాలని సూచించారు.





Leave a Reply