పర్యాటకం, పర్యావరణం, మహిళా సాధికారత
సమగ్ర అభివృద్ధి దిశగా ములుగు జిల్లా: మంత్రి సీతక్క
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా తీసుకుని పర్యాటకం, మహిళా ఉపాధి, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.
తాడ్వాయి మండలం జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్” ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల రద్దీకి దూరంగా, కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా విహరించేందుకు ములుగు జిల్లా పచ్చని ప్రకృతి అందాలు అనువైన గమ్యస్థానమని అన్నారు. బొగత జలపాతం, జలగలంచ బ్లాక్ బెర్రీ ఐలాండ్, తాడ్వాయి హట్స్ వద్ద ఏర్పాటు చేసిన సఫారీ వంటి పర్యాటక ప్రాజెక్టులతో ములుగు జిల్లా ఊటీ, కొడైకెనాల్లకు దీటుగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.

మేడారం జాతర సందర్భంగా భక్తులు, యాత్రికులకు సేవలతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో, జంగాలపల్లి క్రాస్, ఇంచెర్ల క్రాస్, ఎర్రిగట్టమ్మ ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో టీ స్టాల్స్, బొంగు చికెన్, నాటు కోళ్ల విక్రయం, కూరగాయలు, పండ్ల అమ్మకాల స్టాల్స్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందుతుందని తెలిపారు.
అదేవిధంగా మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి సీతక్క పరిశీలించి, పనులు వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జాతర సమయంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా మౌలిక వసతులను బలోపేతం చేయాలని సూచించారు.
మేడారం జాతర అటవీ ప్రాంతంలో “సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకండి – పర్యావరణాన్ని కాపాడండి” అనే నినాదంతో ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గోడపత్రికలు, కరపత్రాలను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. భక్తులు ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కవర్లు వాడకుండా పర్యావరణాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మేడారం జాతరను పర్యావరణహితంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పిలుపునిచ్చారు.







Leave a Reply