మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డికి షాక్
సీబిఐ కేసుతో ఇక ఆశలు వదులుకున్నట్లే
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
తెలంగాణా రాజకీయాలు గత వారం పది రోజులుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రి పై ఓ వార్త సంస్థ ప్రసారం చేసిన వార్త తో వివాదాస్పదంగా మారిన కోమటిరెడ్డి బ్రదర్స్ కంపెనీకి సీబీఐ షాక్ ఇచ్చింది. బిజెపి నుంచి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి వర్గంలో స్థానం ఆశిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా రేవంత్ సర్కార్ ను ఇబ్బందులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి వర్గంలో బెర్త్ లు కూడా ఖాళీగా ఉండడంతో తనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని గత కొన్ని నెలలుగా తన అనుచరులతో చెబుతూ వచ్చారు. బహిరంగంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ గుర్తు చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఇప్పటికే ఒకరు మంత్రి వర్గంలో ఒకరికి చోటు దక్కడంతో మరొకరికి దక్కడం దాదాపు ఆసాధ్యమన్న వాదన వినిపించింది. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి మరో కీలక బాధ్యతలు అప్పగించి క్యాబినెట్లోకి రాజగోపాల్ రెడ్డిని తీసుకునే అవకాశాలున్నాయన్న చర్చ కూడా జరిగింది. ఈసమయంలోనే రాజగోపాల్ రెడ్డి కనుసన్నల్లో నడిచే సుశీ ఇన్ఫ్రా పై కేసు నమోదు కావడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ నోటికి తాళం వేసినట్లే అన్న వాదన ఇప్పుడు మొదలైంది. మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని ప్రస్తుతం డిమాండ్ చేసే పరిస్తితి రాజగోపాల్ రెడ్డికి లేకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హై కమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డికి ఈ పరిస్థితుల్లో మంత్రి పదవి ఇచ్చేందుకు అంతగా ఆసక్తి చూపే అవకాశం కూడా దక్కకుండా పోయిందని అంటున్నారు.సుశీ ఇన్ప్రా రైల్వే కాంట్రాక్టు పనులు దక్కించుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ టెండర్లు దక్కించుకుంటున్నారన్న ఆరోపనణలపై సుషీ ఇన్ఫ్రాపై ఢిల్లీ సీబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. సీబిఐ సుశీ ఇన్ఫ్రా ను ఏ-15 గా ఎఫ్ ఐ ఆర్ లో చేర్చింది. గత ఏడాది క్రితమే కేసు నమోదైనా ఆలస్యంగా వెలుగు చూసింది.సుశీ ఇన్ఫ్రా నేరపూరిత కుట్రకు పాల్పడిందంటూ ఢిల్లీ సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

రైల్వే కాంటాక్టు పనులు దక్కించుకునేందుకు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్కు భారీగా లంచాలు ఇచ్చినట్టు సీబీఐ అధికారులు విచారణలో గుర్తించారు.నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలోని పనుల కోసం అధికారులకు సుశీ ఇన్ఫ్రా సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సంతోష్ కుమార్ అకౌంట్లలో దాదాపు రూ.1కోటి వరకు సుశీ ఇన్ఫ్రా లంచాలుగా జమచేసిందని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో బొగ్గు కుంభకోణం చర్చకు దారి తీస్తున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగు చూడడం కోమటి రెడ్డి బ్రదర్స్ కు ఊహించని షాక్ కొట్టినట్లయింది.ఢిల్లీలో కేసు నెం. RC2172023A004/CBI/AC-II నమోదు చేసిన నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ పోలీసులు కేసు నమోదు చేశారు.






Leave a Reply