తెలంగాణా రాజకీయాల్లో హాట్ హాట్ గా హార్వర్డ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హర్వర్డ్ యూనివర్జిటీ లో ఉన్నత విద్య చదవు కోవాలని అందరికీ ఉంటుంది. కానీ అక్కడ అవకాశం దొరకడమే అతి పెద్ద సమస్య.విద్యాభ్యాసం కోసం వెళ్లాలంటే అత్యుత్తమ అకాడమిక్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఎదుర్కొంటూ అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. ఇది ఒక వేళ సాధ్యం అయినా…. అక్కడ ఫీజులు భరించే స్థోమత కూడా అందరికీ ఉండదు…..ఆర్ధిక స్థోమత ఉన్నా అందరికీ అక్కడ సీట్లు దొరకడం అంత సులువు కాదు. ఇలాంటి ప్రతిష్టాత్మక మైన యూనివర్సిటీ ఈ ఏడాది తెలంగాణా రాజకీయాలతో ముడి పడనుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉండే ఇద్దరు నెతలు నెల రోజుల వ్యవధిలో ఒకరు విద్యార్థిగా…మరొకరు గెస్ట్ లెక్చర్ గా ఆ యూనివర్సిటీని సందర్శించనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్వర్డ్ యూనివర్సిటీలో పొలిటికల్ పాఠాలను నేర్చుకునేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. దాబోస్ పర్యటన అనంతరం యూనివర్జిటీ బోధించే పాఠాలను ప్రత్యక్షంగా వినేందుకు రేవంత్ అమెరికా బయలు దేరి వెళ్లిపోయారు. ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ: కేయాస్, కాన్ఫ్లిక్ట్, అండ్ కరేజ్’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం రేవంత్ రెడ్డి అందులో భాగంగా క్లాసులకు హాజరుకానున్నారు. ఇందుకోసమే సీఎం అమెరికా వెళ్లారు. కోర్సులో భాగంగా మసాచుసెట్స్లోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ క్యాంపస్లో జనవరి 25 నుంచి 30 వరకు స్పెషల్ క్లాసులు జరుగనున్నాయి. వాస్తవ ప్రపంచంలోని సమస్యలను కేస్ స్టడీస్గా తీసుకుని, వాటికి పరిష్కారాలు కనుగొనడంపై ఈ కోర్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. యూనివర్శిటీ నుంచి సర్టిఫికెట్ అందుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఈ విషయంలో ఎక్కడా ఎవరికీ అభ్యంతరాలు లేవు.
అయితే రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ ఆరోపణలు గుప్పిస్తారు. రాజకీయంగా ఇది సహజంగానే జరిగే ప్రక్రియ రాజకీయ ప్రత్యర్థులు కావడంతో రాజకీయం వరకు విమర్శలు ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు…కానీ ఈ ఇద్దరు నేతలు పొలిటికల్ హద్దులు ఎప్పుడో చెరిపేసుకున్నారు. వ్యక్తిగత దూషణల వరకు వీరి మధ్య రాజకీయ వైరం వెళ్లింది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కేటిఆర్ ను, మాజీ సీఎం కేసిఆర్ ను టార్గెట్ చేస్తుండడంతో….అందుకు ధీటుగా బీఆర్ ఎస్ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఇదంతా రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం జరుగుతున్న ప్రక్రియ అయితే….దీనికి హార్వార్డ్ యూనివర్సిటీకి ఇప్పుడు లింక్ అయ్యేలా పరిస్తితులు మారిపోయేలా కనిపిస్తున్నాయి.

హర్వార్డ్ యూనివర్జిటీలో ఓ కోర్సు చదివేందుకు సీఎం రేవంత్ తన పేరును నమోదు చేసుకోగా....అదే యూనివర్జిటీ గెస్ట్ గా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను ఆహ్వానిస్తోంది. వచ్చే నెల 14,15 తేదీల్లో హార్వర్డ్ యూనివర్జిటీలో జరిగే 23వ ఇండియా కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి కేటిఆర్ ప్రసంగించాలని ఆహ్వానం అందింది. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, పబ్లిక్ పాలసీ, వ్యవస్థాపక టెక్నాలజీ, యువ నాయకత్వం వంటి అంశాలపై ప్రసంగించాల్సిందిగా హార్వర్డ్ యూనివర్జిటీ కోరింది. తెలంగాణా అభివృద్ధిలో ఆయన పాత్రను కూడా కేటిఆర్ అక్కడ వివరించాలని యూనివర్సిటీ కోరింది.
గతంలో కూడా రెండు సార్లు కేటిఆర్ ను గెస్ట్ లెక్చర్ ఇవ్వాలని హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది. 2016 ఫిబ్రవరి 6,7 తేదీల్లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ , కెన్నెడీ స్కూల్ ఆహ్వనించింది.2024 లో గ్రాడ్యుయేట్ విద్యార్థులు స్వయంగా కేటిఆర్ ను కలిసి ఆహ్వానించారు. తాజాగా ఫిబ్రవరి 14,15వ తేదీల్లో జరుగనున్న "The India We Imagine" అనే థీమ్ పైరెండో రోజు ప్రసంగించాలని కేటిఆర్ కు ఆహ్వానం అందింది. అయతే ఇప్పటి వరకు హార్వర్డ్ యూనివర్జిటీకి వెళ్లేందుకు కేటిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
తాజా పరిస్థితులను పరిశీలిస్తే వచ్చే నెలలో హర్వర్డ్ యూనివర్జిటీలో జరిగే కార్యక్రమానికి కేటిఆర్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్ ఎస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో కేటిఆర్ విద్యా భ్యాసం గురించి తరచూ వ్యాఖ్యలు చేసే సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలంటే ఇది తమకు ఒక అస్త్రంగా గులాబీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు హర్వర్డ్ యూనివర్సిటీ చుట్టూ తెలంగాణా రాజకీయాలు తిరిగే అవకాశం కనిపిస్తోంది.



Leave a Reply