NewsInn

News in a Click

కేంద్ర మంత్రికి కేటీఆర్ లీగల్ నోటీసులు

కేంద్ర మంత్రికి కేటీఆర్ లీగల్ నోటీసులు

కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కేంద్ర మంత్రి బండి సంజ‌య్, ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ ల‌కు లీగ‌ల్ నోటీసులు పంపారు. తన‌తో పాటు తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు విడివిడిగా లీగల్ నోటీసులు పంపారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అడ్డగోలుగా మాట్లాడిన వీరు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సాక్షాధారాలు లేకుండా కేవలం దురుద్దేశం పూర్వకంగా, రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ…చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారు. ఈ మేరకు బండి సంజయ్, అరవింద్ లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు.

బండి సంజయ్‌కు పంపిన నోటీసులో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం మరియు సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని పేర్కొన్నారు. ఈ ఇద్దరు ఎంపీలు కేటీఆర్‌కు బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో, సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *