ఏబీఎన్ రాధాకృష్ణ కు భట్టి కౌంటర్
ఎవరి సంతోషం కోసం ఆ వార్త….తప్పు ఒప్పుకో
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నైనీ టెండర్ల వ్యవహారంలో మొదలైన బొగ్గు కుంభకోణాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. వారం రోజుల క్రితం ఓ మీడియా అధినేత స్వయంగా రాసిన ఓ వార్త రాజకీయాలను మరింత హాట్ హాట్ గా మార్చింది. ఈ వార్తలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కను టార్గెట్ చేస్తూ ఆయన రాసిన కొత్త పలుకుసై డిప్యటీ సీఎం వారం రోజుల తరువాత ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల నుంచి ఉన్నత విలువలు కాపాడుతూ రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. ఎవరి సంతోషం కోసం రాధాకృష్ణ ఆ వార్త రాశారో చెప్పాలన్నారు. రాసింది అవాస్తవమని అంగీకరించాలని, లేని పక్షంలో వ్యక్తిత్వ హననంగా భావించాల్సి ఉంటుందని భట్టి వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టు ఇచ్చేటప్పుడు సైట్ విజిట్ అనేది మేం పెట్టిన కొత్త నిబంధన కాదని,
కోలిండియా తో పాటు, ఎన్ఎండిసి, ఆయిల్ కంపెనీలు ఇతర ప్రధాన కంపెనీలలో
ఇప్పటికే ఈ నిబంధన ఉందని తెలిపారు .

హరీష్ రావ్ తనకు లేఖ రాస్తే 2014 నుంచి సింగరేణిలో జరిగిన టెండర్లపై విచారణకు సిద్ధమని భట్టి అన్నారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే సీఎం ఒప్పించి విచారణ చేపడుతామన్నారు. సింగరేణిపై గద్దలను, రాబంధులను వాలనివ్వనని…తప్పుడు వార్తలతో సింగరేణి సంస్థకు నష్టం కలిగించడం శోచనీయమని వ్యాఖ్యానించారు. సింగరేణిలో టెండర్లు, వాటికి సంబంధించిన టెండర్లు కానీ వాటికి సంబంధించిన ఫైళ్లు గానీ తన వద్దకు గానీ రాష్ట్ర ప్రభుత్వం వద్దకు రావని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అన్ని నిర్ణయాలు సంస్థలో అమలులో ఉన్న విధివిధానాలు, నిబంధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.సైట్ విజిట్ నిబంధనను తాము కొత్తగా అమలు చేయడం లేదని జాతీయ స్థాయి సంస్థలు అన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఆ నిబంధనను పాటిస్తున్నాయన్నారు.

సీఎం బావమరిదికి సంబంధం లేదు….
సింగరేణి సంస్థ టెండర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి బావ మరిదికి కట్టబెడుతున్నట్లు ఒక కట్టు కథను ప్రచారం చేస్తున్నారని ఇది సమంజసం కాదన్నారు. సింగరేణిలో బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులకే కాంట్రాక్టులు ఉన్నాయని చెప్పారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే అల్లుడే సీఎం బావమరిది సుజన్ రెడ్డి అని భట్టి పేర్కొన్నారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, సింగరేణి మేనేజ్మెంట్ మరియు కార్మికులు పూర్తి కమిట్మెంట్తో సంస్థ భవిష్యత్తును కాపాడుతారని స్పష్టం చేశారు.







Leave a Reply