NewsInn

News in a Click

సిద్దిపేట‌, సిరిసిల్ల జిల్లాల్లో అక్ర‌మాలు

సిద్దిపేట‌, సిరిసిల్ల జిల్లాల్లో అక్ర‌మాలు

అక్ర‌మార్కుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

శాస్త్రీయంగా జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకొని ప్ర‌భుత్వ భూముల‌ను కొల్ల‌గొట్టిన‌వారిని, రిజిస్ట్రేష‌న్‌ల చ‌లానా సొమ్మును కాజేసిన‌వారిని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను అడ్డుపెట్టుకొని గ‌త ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు ప్ర‌భుత్వ భూముల‌ను కాజేశార‌ని, దీనిపై సిద్దిపేట‌, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్ర‌భుత్వ అనుబంధ సంస్ధ‌తో పైల‌ట్ కింద ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని ఇందులో అనేక అవినీతి అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ప్రాధ‌మిక నివేదిక‌లో స్ప‌ష్ట‌మైంద‌ని తెలిపారు.ఈ ఫోరెన్సిక్ నివేదికను ప‌రిశీలించిన త‌ర్వాత మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వ‌హిస్తామ‌న్నారు.


ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఆధారంగా జ‌రిగిన అక్ర‌మాల‌పై ఉన్న‌త‌స్ధాయి క‌మిటీతో మంత్రి పొంగులేటి స‌మీక్ష నిర్వ‌హించారు. విచార‌ణ‌లో ఎదురైన అంశాలు,ఎవ‌రి పాత్ర ఎంత‌? తెర‌వెనుక ఎవ‌రైనా ఉన్నారా? రెవెన్యూ అధికారుల పాత్ర ఏమైనా ఉందా? వ‌ంటి అంశాల‌పై క‌మిటీ స‌భ్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌మిటీ ప్రాధ‌మిక నివేదిక‌ను ప‌రిశీలించి మ‌రికొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తూ మ‌రింత లోతైన విచార‌ణ జ‌రిపి తుది నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు.

శాస్త్రీయంగా జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌ చేస్తాం…..

కేటీఆర్ మాట్లాడుతున్న భాష స‌రిగా లేద‌ని మ‌తి లేకుండా మాట్లాడుతున్నార‌ని మంత్రి మీడియాతో వ్యాఖ్య‌లు చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌లు వ్య‌క్తిగ‌తంగా తాను రిఫ‌రెండంగా భావిస్తున్నాన‌ని అన్నారు. ఇప్ప‌టికే రెండు సార్లు కేటీఆర్‌ రిఫ‌రెండం అన్నారు. మ‌ళ్లీ ఇప్పుడు రిఫ‌రెండం అంటున్నారు. ఇంత‌కు ముందు జ‌రిగిందే ఈ ఎన్నిక‌ల్లో జ‌రుగుతుంది.ఆనాడు సోయి లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు జిల్లాల‌ను ఏర్పాటు చేసి ఇప్పుడు అగ్నిగుండం చేస్తామ‌ని మ‌తిలేని మాటలు మాట్లాడుతున్నారు. ప్ర‌జాభిప్రాయానికి అనుగుణంగా శాస్త్రీయ ప‌ద్ద‌తిలో ప్ర‌జామోదంతో జిల్లాల‌ను పున‌ర్ వ్య‌వ‌స్ధీక‌రిస్తామ‌న్నారు.బీఆర్ఎస్ పాల‌న‌లో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లుగానే ఇప్పుడు కూడా అలాగే జ‌రుగుతున్నాయ‌ని కేటిఆర్ భ్ర‌మ‌ప‌డుతున్నారని, ఇంకా అధికారంలో ఉన్న‌ట్లుగా వారి వ్య‌వ‌హార శైలిఉందన్నారు. బీఆర్ ఎస్ నేత‌లు అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌గ‌టిక‌ల‌లు కంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *