ట్యాపింగ్ దోషులు తేలాల్సిందే
మంత్రి జూపల్లి కృష్ణా రావ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)

గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ నేతలు కేటిఆర్, హరీష్ రావ్ లను సిట్ సాక్షులుగానే విచారణకు పిలిచిందని స్పష్టం చేశారు. సాక్షిగా సిట్ విచారణకు పిలిస్తే, కేటీఆర్ ఎందుకు అంతలా ఆందోళన చెందుతున్నారని మంత్రి ప్రశ్నించారు. గతంలో ఏ విచారణకైనా సిద్ధం అని ప్రగల్భాలు పలికిన కేటీఆర్, ఇప్పుడు నోటీసులు రాగానే డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేకపోతే, నిర్ధోషులైతే భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారిని కూడా సాక్షులుగా పిలుస్తున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత దుర్మార్గమని, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో తొంగిచూడటం ఏ సంస్కృతిని సూచిస్తుందో బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉందని, నిజాలు బయటకు రావడం ఖాయమని చెప్పారు. రాజకీయ నాయకులు చట్టానికి అతీతులు కాదని, తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని ఛిన్నభిన్నం చేసిన బీఆర్ఎస్ నేతలను ప్రజలు ఎప్పుడో విస్మరించారని మంత్రి అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్, హరీష్ రావు తమపై పడ్డ బట్ట కాల్చి ఇతరుల మీద వేసే పనులు మానుకోవాలని హితవు పలికారు.







Leave a Reply