రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్
తెలంగాణ భవన్లో కేటీఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాహుల్ గాంధీ తుక్కుగూడలో విడుదల చేసిన ‘న్యాయ పత్రం’లో పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడారని, కానీ ఆ వేదికపైనే బీఆర్ఎస్ నుండి ఫిరాయించిన వారు ఆయన పక్కనే కూర్చున్నారని కేటిఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజ్యంగం వర్సెస్ రాక్షస పాలన కొనసాగుతోందని ఆరోపించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, కాంగ్రెస్ న్యాయ పత్రంలో అంతే ఉందని ఎద్దేవా చేస్తూ, దీన్ని ‘అన్యాయ పత్రం’గా పిలవాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి “జెండా గద్దెలను కూల్చేయండి” అని బహిరంగ సభల్లో పిలుపునివ్వడం శాంతిభద్రతలను మరియు రాజ్యాంగ విలువలను సమాధి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.తన ప్రసంగంలో పలుమార్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన సందర్భంగా చెప్పిన మాటలను కేటీఆర్ ప్రస్తావించారు. “రాజ్యాంగం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వారిలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం” అన్న అంబేద్కర్ మాటలను ఉటంకిస్తూ, నేడు కేంద్రంలోని బీజేపీ మరియు రాష్ట్రంలోని కాంగ్రెస్ పోటీ పడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు రాజ్యాంగ ఉల్లంఘనలపై నాటికలు ప్రదర్శించారు.

పార్టీ ఫిరాయింపులు, సీఎం రేవంత్ పాలన, ప్రభుత్వ వైఫల్యాల వంటి అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సహా పార్టీ నేతలంతా విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారో కళ్లకు కట్టేలా తమ లగునాటిక ద్వారా వివరించారని కేటీఆర్ అన్నారు. తమ యూనివర్సిటీ భూముల పైన దౌర్జన్యం చేసిన రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఇందులో స్పష్టంగా కనిపించిందని కేటీఆర్ అన్నారు.






Leave a Reply