రేపటి నుంచే నామినేషన్లు
ఫిబ్రవరి 11న పోలింగ్ 13న కౌంటింగ్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలకు ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. సంబంధిత అధికారులు బుధవారం స్థానికంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా బుధవారం నుంచే మొదలు కానుంది. గతంలో వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో…. నామినేషన్ల ప్రక్రియను బుధవారం నుంచే ఎన్నికల కమిషన్ మొదలు పెట్టేలా షెడ్యూల్ జారీ చేసింది. మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ కు అవకాశం ఉంది. 31వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగ నుంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 10 రోజుల పాటు ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులకు సమయం దక్కుతుంది. 11 వ తేదీన పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన కౌంటింగ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఎన్నికల కమీషన్ చైర్మన్ రాణి కుముదీని ఎన్నికల ఏర్పాట్లపై మీడియాకు వివరించారు. ఈ నెల 16వ తేదీన మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్, చైర్మన్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పటిష్ఠమైన భద్రతా చర్యలు…
ఎన్నికల సందర్భంగా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ చెప్పారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్న ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు ఉంటాయని, ఒక్కో వ్యక్తి 50 వేల రుపాయలకు మించి తీసుకెళ్లేందుకు ఎన్నికల నిబంధనల ప్రకారం అనుమతించమని చెప్పారు. అంతకు మించి డబ్బులు తీసుకెళితే అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాలను మూడు జోన్లగా విభజించి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు భగవత్ వివరించారు. ఎన్నికల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.






Leave a Reply