త్వరలో విధి విధానాలు
ఏపీ ప్రభుత్వం నిర్ణయం
(అమరావతి,న్యూస్ఇన్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా విషయంలో చిన్నారులను దూరంగా ఉంచాలనే అభి ప్రాయంతో ఉంది. 16 ఏళ్లలోపు చిన్నారులకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విధి విధానాలపై కసరత్తు మొదలు పెట్టింది. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ ఈ రోజు సమావేశం అయింది.సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… చిన్నారులపై సోషల్ మీడియా నిషేధం విధించే అంశంపై సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్స్ లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… మలేషియాలో మై డిజిటల్ ఐడీ, పాస్ పోర్టు వివరాలతో ఈ-కేవైసీ అనుసంధానం ద్వారా 16సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఉందని తెలిపారు. చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలన్న విషయమై మంత్రుల బృంద సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఎంత వయోపరిమితి విధించాలనే విషయమై వివిధ దేశాల్లో చట్టాలను పరిశీలించాల్సిందిగా మంత్రుల బృందం అధికారులకు సూచించింది.

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్…..
సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పోస్టు చేసే వారితో పాటు కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే హెబిచ్యువల్ అఫెండర్స్ ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై చర్చించేందుకు గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాం కంప్లయన్స్ ఆఫీసర్లను కూడా వచ్చే జీవోఎం సమావేశానికి రప్పించాలని సూచించారు. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు సెక్షన్-46 ఐటీ యాక్ట్ ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నియామకంపై నోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు.







Leave a Reply