NewsInn

News in a Click

ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

(అమరావతి, న్యూస్ఇన్‌)


ఏపీలో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశంలో కేన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి కాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను సీఎం విడుదల చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి రూపొందించిన ఈ అట్లాస్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి నమోదు చేసిన వివరాలతో ఈ అట్లాస్ ను రూపొందించారు. విజన్ స్టేట్మెంట్ ద్వారా 2030 నాటికి అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్, మిషన్ స్టేట్మెంట్‌ ద్వారా ముందస్తు స్క్రీనింగ్ టెస్టులతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తగ్గించేలా అట్లాస్‌ ద్వారా కార్యాచరణ చేపట్టనున్నారు. హెల్త్ ఎడ్యుకేషన్, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన, ప్రివెన్షన్, స్కీనింగ్, ఎర్లీ డిటెక్షన్ వంటివి క్యాన్సర్ కేర్ స్ట్రాటజీలో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పురుషులు, మహిళల నుంచి నమోదు చేసిన సమాచారం ఆధారంగా చికిత్సలు, సర్జికల్, రేడియేషన్, మెడికల్ ట్రీట్మెంట్ వారీగా అట్లాస్ లో వివరాలు పొందుపరిచారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఎంతమంది, ఏ రకమైన క్యాన్సర్ రోగులు ఉన్నారో గుర్తించేందుకు, స్థానికంగా చికిత్సలు అందించేందుకు వీలుగా సమాచారం తెలిసేలా ఈ అట్లాస్ కు రూపకల్పన చేశారు.

నివార‌ణా చ‌ర్య‌లు…..

ప్రస్తుతం ఏపీలో 32,657 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని… ఐసీఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2030 నాటికి 20 శాతం కేసులు పెరుగుదల ఉంటుందని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరించారు. రోగులను మ్యాపింగ్ చేసి 23 బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రుల ద్వారా రోగులకు డే కేర్ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ చికిత్స అందించే అవకాశం ఉందని అన్నారు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్ పీవీ వ్యాక్సినేషన్ అందించేందుకు వివిధ సంస్థలు, ఎన్ఆర్ఐల నుంచి కూడా సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన పెరిగిందని .. ముందస్తు పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *