మంత్రి రామ్మోహన్ నాయుడు
విమానయాన శాఖకు మామునూరు భూముల అప్పగింత
(హైదరాబాద్,న్యూస్ఇన్)
వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గా పూర్తి చేసింది. సేకరించిన భూములను నేడు బేగంపేట్ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్ మోహన్ నాయుడుకు అధికారికంగా అప్పగించారు.కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశంలో ప్రాంతీయ వైమానిక అనుసంధానాన్ని విస్తృతంగా పెంచుతూ సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

మామునూరు విమానాశ్రయాన్ని త్వరితగతిన కార్యాచరణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. .ఈ విమానాశ్రయ అభివృద్ధి వ్యయం మొత్తాన్ని భారత విమానాశ్రయాల అథారిటీ భరిస్తుందని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టులో 2,500 మీటర్ల రన్వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్, అగ్నిమాపక మరియు భద్రతా సదుపాయాలు, అనుబంధ మౌలిక వసతుల నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి 2 నుండి 2.5 సంవత్సరాలలో విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
మామునూరు విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని కాకతీయుల శిల్పకళా, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది కేవలం రవాణా సదుపాయంగా కాకుండా, ప్రాంతీయ గుర్తింపును ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తుందన్నారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఒక విమానాశ్రయం ఎలా ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు మరియు పట్టణాభివృద్ధికి దోహదపడుతుందో వివరించారు. అదే విధంగా మామునూరు విమానాశ్రయం వరంగల్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు.




Leave a Reply